అన్లాక్ 3.0 లో భాగంగా కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో అన్లాక్ 3.0 గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్లాక్ 4.0 మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సెప్టెంబర్ 1 నుంచి మొదలయ్యే అన్లాక్ 4.0 ప్రక్రియలో మెట్రో రైళ్ల సేవలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత మార్చ్ లో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో మెట్రో సేవలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్ల సేవలు పునః ప్రారంభంపై వివిధ వర్గాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది.
ఇక అన్లాక్ 4.0 లో కూడా పాఠశాలలు, కాలేజీలు తెరిచే అవకాశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభానికి అనుమతించిన కూడా ఒకే రోజున అన్ని సెక్షన్స్/ క్లాసుల విద్యార్థులు హాజరు కాకుండా నిబంధనలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే దేశంలో ఐఐటిలు, ఐఐఎం లు ప్రారంభించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు మూసివేసిన బార్లకు కూడా అనుమతించి, కౌంటర్లు ద్వారా మద్యాన్ని తీసుకెళ్లేలా మార్గదర్శకాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్లాక్ 4.0 మార్గదర్శకాలను మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu