ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో నేడుమేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. నాగాలాండ్ లో 60, మేఘాలయలో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నేడు రెండు రాష్ట్రాల్లో 59 చోట్లనే పోలింగ్ జరుగుతోంది. నాగాలాండ్ లోని ఆకులిటో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో బీజేపీ ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక మేఘాలయలో యూడీపీ అభ్యర్థి హెచ్డిఆర్ లింగ్డో మరణంతో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహియాంగ్ నియోజకవర్గానికి పోలింగ్ వాయిదా పడింది.
ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అన్ని పోలింగ్ బూత్ ల వద్ద ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ పలు పార్టీల కీలక నాయకులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు నాగాలాండ్ లో 38.68 శాతం, మేఘాలయలో 26.70 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “మేఘాలయ మరియు నాగాలాండ్ ప్రజలను, ముఖ్యంగా యువకులు మరియు మొదటి సారి ఓటర్లు ఈరోజు రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు. అలాగే నాగాలాండ్ లోని అర్హులైన ఓటర్లందరూ, ప్రత్యేకించి తొలిసారిగా ఓటు వేసే వారు ఈరోజు రికార్డు స్థాయిలో ఓటు వేయాలని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో విజ్ఞప్తి చేశారు. నాగాలాండ్ లో అధికార ఎన్డీపీపీ, బీజేపీ పొత్తులో పోటీ చేయగా, కాంగ్రెస్, ఎన్పీపీ, జేడీయూ, ఎన్సీపీ కూడా గట్టిగా పోటీ ఇస్తున్నాయి. అలాగే ఎన్పీపీకి చెందిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దక్షిణ తురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, అర్హులైన వారంతా ఓటు వేయాలని సూచించారు. మేఘాలయలో అధికార ఎన్పీపీ, కాంగ్రెస్, టీఎంసీ, బీజేపీ మధ్యనే కీలక పోటీ నెలకుంది. మరోవైపు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మార్చి 2న నిర్వహించి, ఫలితాలు వెల్లడించనున్నారు.
నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:
- మొత్తం అసెంబ్లీ స్థానాలు: 60
- పోలింగ్ జరిగే స్థానాలు: 59
- బరిలో నిలిచిన అభ్యర్థులు: 183
- పోలింగ్ కేంద్రాలు : 2291
- ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 13,17,634
మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు:
- మొత్తం అసెంబ్లీ స్థానాలు: 60
- పోలింగ్ జరిగే స్థానాలు: 59
- బరిలో నిలిచిన అభ్యర్థులు: 369
- పోలింగ్ కేంద్రాలు : 3,419
- ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 21,64,973.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE