సనాతన ధర్మాన్ని ఎక్కువగా నమ్మే హిందువులకు జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే చారిత్రాత్మకంగా నిలిచి ఉండే కార్యక్రమం జరగనుంది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెలలోనే జరగనుంది. హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం దేవాలయంలో జరిగే దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకపోతే.. దేవుని ఆరాధన అనేది అసంపూర్ణమవుతుందని పెద్దలు అంటారు. అయోధ్యలోని నూతన రామమందిరంలో జనవరి 22న రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది.
చాలామందికి ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? దీనిలో విశిష్టత ఏంటి అనేది తెలియదు. నిజానికి సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు చాలా ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో తప్పనిసరిగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా దేవతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో.. ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ట అనేదానిలో..’ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా.. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆ దేవతా మూర్తి విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం వస్తుంది.
ప్రాణ ప్రతిష్ట కంటే ముందు ఏ విగ్రహానికి అయినా సరే పూజలు చేయరు. ఎందుకంటే ఈ కార్యక్రమం అయితేనే ఆ దేవుని విగ్రహం పూజకు అర్హమైనదిగా భావిస్తారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదని అవుతుందని చెబుతారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులకు త్రికరణ శుద్ధిగా మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు.
ప్రాణ ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యి ఉంటాడని వేద పండితులు చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు.
ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ దేవతా మూర్తి విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని శుభ్రమైన బట్టతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. తర్వాత ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధం పూస్తారు. తర్వాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ,త్రికరణశుద్ధిగా మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా మూర్తి విగ్రహానికి హారతి ఇచ్చి.. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాకే భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ