రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో తుడుచుపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ జెండా పదేళ్ల తర్వాత మళ్లీ కనిపిస్తోంది. ఆ పార్టీ పేరు వెలుగులోకి వస్తోంది. రాజకీయంగా ప్రాబల్యం పెంచుకుంటోంది. అందుకు కారణం.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తుండడమే. మరో విషయం ఏంటంటే.. ఇక్కడ షర్మిల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్వయానా చెల్లి కావడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరైనప్పటికీ.. అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించినట్లుగా కథనాలు వెలువడ్డాయి. జగన్, షర్మిల అన్నాచెల్లెళ్లు. ఇద్దరి మధ్య దూరం పెరగడం..ఇద్దరూ రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నందున వారి తీరును ప్రత్యేకంగా పరిశీలించేందుకు మీడియ వారిపైనే దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు ఆదివారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలోనూ.. ఈ సందర్భంగా అన్న తీసుకునే నిర్ణయాలపైనా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అధ్యక్ష పదవి చేపట్టక ముందే.. జరిగిన కుమారుడి నిశ్చితార్థం, పెళ్లికి పార్టీల కతీతంగా, పవన్కళ్యాణ్లతో సహ పలువురికి ఆహ్మానాలు అందజేశారు షర్మిల. పవన్ కల్యాణ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు కూడా. ఈ క్రమంలో ఒకప్పుడు ఉమ్మడి ఏపీకి తమతండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి తాను స్వీకరిస్తున్నందున వచ్చి ఆశీర్వదించమని అన్న జగన్ను ఆహ్వానిస్తారా? అన్నదీ నిశిత పరిశీలకులకు ఆసక్తికరంగా మారింది. రాజకీయం రాజకీయమే.. అనుబంధం అనుబంధమే అంటున్న షర్మిల అన్న జగన్ను ఆహ్వానిస్తారా.. అన్నది వారికి వేయిడాలర్ల ప్రశ్నగానూ మారింది.
నిశ్చితార్థం, ప్రమాణస్వీకారం కార్యక్రమాల సంగతులలా ఉండగా.. ఏపీలో ఇక అన్నా చెల్లెళ్ల సవాల్ మొదలైనట్లే. త్వరలో జరగబోయే రెండు ఎన్నికల్లో వైఎస్ వారసులుగా గెలిచేదెవరో ? ప్రజల మనస్సుల్లో నిలిచేదెవరో ? వెల్లడయ్యేందుకు మూడు నెలలు ఆగాల్సిందే. సినిమాలు వేరు వాస్తవాలు వేరనే అభిప్రాయాలు చాలామందిలో ఇప్పటికీ ఉన్నాయి కానీ.. కొన్ని సంఘటనలు చూస్తే అవి నిజమే అనిపిస్తుంది. సినిమాల్లో మాదిరిగా మీసం తిప్పి సవాల్ చేసినంత మాత్రాన గెలుపుసాధ్యం కాదని భావించే వారికి ఇటీవల తెలంగాణలో గెలిచిన రేవంత్ ఒక ఉదాహరణ. గతంలో తమిళనాట జయలలిత అధికారంలోకి రావడం సైతం సినిమాను మించిన థ్రిల్లింగ్ అన్నది ఆ తరం వారికి తెలుసు. ఈ ప్రస్తావనంతా ఇప్పుడెందుకంటే.. అన్నా చెల్లెళ్లు, ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటారా? సినిమాల్లో తప్ప అని భావించే వారి అభిప్రాయాల్ని ఏపీ రాజకీయాలు మార్చనున్నాయి. ఒకప్పుడు జగనన్న బాణాన్ని అంటూ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున పాదయాత్ర చేసిన షర్మిల ప్రస్తుతం జగన్కు రివర్స్ కావడం సినిమాకు తక్కువయ్యే స్టోరీ కాదు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రావడం.. ప్రజలు మెచ్చే పాలన నందించడం..అనే అంశాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అసలైన వారసులుగా ఎవరు నిలవగలరో త్వరలో వెల్లడి కానుంది.
ప్రస్తుతానికి కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న షర్మిల.. పెళ్లి తర్వాత పీసీసీ నేతగా చురుకైన పాత్ర వహించనున్నారు. అప్పటికి అటూఇటూగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఇక అప్పటినుంచి ప్రారంభమయ్యే ప్రచార పర్వంలో అన్నాచెల్లెల్లు ఏం ప్రచారం చేస్తారు ? ఎలా విమర్శించుకుంటారో చూడాలనే ఉత్సుకత ఎందరిలోనో ఉంది. వ్యక్తిగత అంశాలు ప్రస్తావించకుండా పార్టీపరంగా మాత్రమే ప్రచారం చేస్తారా ? ప్రచారంలోనూ రెండు పార్టీలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తారా లేక ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ