ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యం విషయంలోనూ, ఆహారం విషయంలోనూ శ్రద్ధ చూపించినా ఇప్పుడు మాత్రం పాత లైఫ్ స్టైల్నే ఫాలో అవుతున్నారు. దీనికి తోడు లాంగ్ టర్మ్ కోవిడ్ లక్షణాలు చాలామందిలో ఉండిపోయాయి. దీంతో ఏ మాత్రం తేడా చూపించినా చనిపోతున్న కేసులు ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు కరోనా తర్వాత గుండెపోటు కేసులు ఎక్కువ అవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి కేసులు అంటే గుండెజబ్బులు ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో స్త్రీల కంటే మగవాళ్లే ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నట్లు అధ్యయనాలు గుర్తించాయి. గతేడాది తెలంగాణలో 284 మంది గుండెపోటుతో మరణించగా.. ఇందులో 257 మంది పురుషులు కాగా.. 27 మంది మహిళలున్నారు. ఇక ఆంధప్రదేశ్లో 176 మంది గుండెపోటుతో చనిపోగా .. 162 మంది మగవాళ్లు, 14 మంది ఆడవాళ్లు ఉన్నారని ఏడీఎస్ఐ అంటే.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇండియా -2022 నివేదికలో ఈ విషయాన్ని బయటపెట్టింది.
గుండె జబ్బులకు ప్రధాన కారణం జన్యు సంబంధమైనవేనట. బలహీనమైన గుండె కండరాలు ఉన్నవారికి హార్ట్ ఎటాక్లకు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుందని నివేదికలో తేలింది. మహిళలకు మెనోపాజ్ దశ వరకు శరీరంలో హార్మోన్లు భద్రతను కల్పిస్తాయి. కానీ, పురుషులకు అలా ఉండదు కాబట్టి యుక్త వయసులో ఉన్నవారికి కూడా మగవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాదు లైఫ్ స్టైల్ వల్ల కూడా గుండెపోటు బారిన పడుతున్నారట. అతిగా నాన్ వెజ్ తినడం, కొవ్వు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక, మానసిక ఒత్తిడి, అస్థిరమైన జీవనశైలి వల్ల గుండెపోటు వస్తుంటుందని వైద్యులు కూడా చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా చూసుకున్నా కూడా గుండె ఆగుతున్న వారిలో పురుషులే ఎక్కువని వారిలో కూడా.. యువకులే ఎక్కువ మంది ఉన్నట్లు నివేదిక గుర్తించింది. గతేడాది దేశంలో 32,410 మంది గుండెపోటుతో హఠాత్తుగా చనిపోగా .. ఇందులో 28,005 మంది పురుషులు ఉండగా.. 4,405 మంది మహిళలు ఉన్నారని. అలాగే 2021లో 28,413 మంది హార్ట్ అటాక్తో మృత్యువాత పడినట్టు నివేదిక చెబుతుంది. 2022లో మాత్రం 32,410 కేసులు రావడంతో ఏడాదిలో 12.5 శాతం పెరిగినట్లు అయింది. అలాగే గతేడాది 289 మంది మైనర్లలో కూడా హార్ట్ అటాక్ రాగా.. ఇందులో 185 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలు ఉన్నారు.
మొత్తంగా 18 నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉన్నవారిలో 12,759 మంది యూత్కు గుండెపోటు రాగా.. 11,210 మంది పురుషులు, 1,549 మంది మహిళలు ఉన్నారు. అలాగే 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారిలో 12,290 మంది గుండె పోటుతో చనిపోగా.. అందులో 10,854 మంది మగవాళ్లు, 1,436 మంది మహిళలు ఉన్నారు. అంతేకాదు 60 ఏళ్ల పైబడిన వాళ్లలో 7,069 మంది గుండెపోటుతో చనిపోగా వారిలో 5,756 మంది పురుషులు, 1,313 మంది మహిళలు ఉన్నారు.
ఏ వయసు వారు అయినా గుండెపోటు బారిన పడకుండా ఉండటానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు అంతా మానసిక, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి చూడాలి. ప్రతీరోజు శారీరక వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో రోజులో కొంత సమయాన్ని అయినా కేటాయించాలి. ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడానికి నిత్యం యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. అంతేకాదు 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ వీలయినప్పుడల్లా గుండె పరీక్షలు చేయించుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE