ప్రభుత్వాలు మారినప్పుడు పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. కొందరి పదవులకే ఎసరొస్తుంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల విషయంలో పలు మార్పులు.. చేర్పులు చేస్తోంది. ఇప్పటికే సలహాదారుల నియామకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలోని పలు కార్పోరేషన్ల ఛైర్మన్ల నియామకాలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 54 కార్పోరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో.. ఇంతకముందే కొందరు తమ పదవులకు రాజీనామా చేశారు. కొందరు మాత్రం ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఈక్రమంలో వారి నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, సివిల్ కార్పోరేషన్ ఛైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, రైతు బంధు సమితి ఛైర్మన్ తాటికొండ రాజయ్య, రెడ్కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి సహా 54 కార్పోరేషన్ ఛైర్మన్ల నియామకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
సాధారణంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వారికి.. ఇతర పదవులు ఇవ్వటానికి కుదరని వారికి వివిధ సంస్థల కార్పోరేషన్లకు ఛైర్మన్ పదవి ఇస్తుంటారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తమ ప్రభుత్వం హయాంలో.. ఎందుకు ఇచ్చారో కూడా తెలియని విధంగా పలువురికి ఛైర్మన్ పదవుల్ని ఇచ్చేశారు. రెండేళ్ల పదవీకాలం ఉండే ఈ పోస్టులను ఉప ఎన్నికలు వచ్చినప్పుడు.. కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు కొందరికి కట్టబెట్టారు.
ఇకపోతే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు. మాజీ ఐఏఎస్లు సోమేశ్ కుమార్, రాజీవ్ శర్మ, మాజీ ఐపీఎస్లు ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, మాజీ ఐఈఎస్ జీఆర్ రెడ్డి, మాజీ ఐఎఫ్ఎస్ ఆర్. శోభ, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి నియామకాలను రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేకు సీఎస్ శాంతి కుమార్ ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE