తెలంగాణలో ఎన్నికల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారం క్లైమాక్స్కు చేరింది. మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెర పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిశ్శబ్ధ వాతావరణం నెలకొననుంది. దాదాపు రెండు నెలలుగా అన్ని పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా జనాలను మచ్చిక చేసుకునేందుకు చమటోడ్చుతున్నారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి భారీ ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారాలకు ఈరోజు సాయంత్రం 5 గంటలతో తెర పడనుంది. మైకు సెట్లు మూగబోనున్నాయి.
ప్రచారానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో నేతలు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మిగిలి ఉన్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగ పరుచుకునేందుకు సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. తారాస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిరోజులుగా రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అటు మంత్రి కేటీఆర్ ఓవైపు సభలు, ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తూనే మరోవైపు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతున్నారు.
ఇక బీజేపీ తరుపున ఢిల్లీ నుంచి అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు దూకుడుగా వెళ్తోన్న కాంగ్రెస్ కూడా ఢిల్లీ నుంచి అగ్రనేతలను రంగంలోకి దింపింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో నేతలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
30న ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. డిసెంబర్ మూడో తేదీన నేతల భవితవ్యం తేలిపోనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE