యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022-2025 సంవత్సరాలకు గాను ‘‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’’ ప్రదానం చేసే “గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్” (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోషకరమని అన్నారు. స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని సీఎం అన్నారు. తెలంగాణ దేవాలయానికి ‘ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం’ అవార్డు రావడం, ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరి గుట్ట పునర్నిర్మాణం, భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని సీఎం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రశంసించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా పునఃప్రతిష్ఠ చేసిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా యాదగిరి పంచ లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రార్థించారు.
ఈ క్రింది నిబంధనలమేరకు.యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి “గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్” (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు దక్కింది:
- 13వ శతాబ్దానికి చెందిన శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయ స్వయంభూ పవిత్రతకు భంగం వాటిల్లకుండా, స్వయం భువుని ఏ మాత్రం తాకకుండా ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ నిర్మాణం చేపట్టినందుకు.
- ఆలయం లోపలి వెలుపలి ప్రాంగణంలో శిలలను సంరక్షణ చేసినందుకు.
- నూటికి నూరు శాతం సెంట్రల్ ఎయిర్ కండిషన్ విధానంతో పాటు ఆలయ వాహిక (ducting) నిర్మాణాలు తదతర సుందరీకరణ పనులను ఆలయ గోడలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చేపట్టినందుకు.
- ప్రత్యేక ‘సూర్య వాహిక’ ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసారం జరిగేలా ప్రత్యేక నిర్మాణం చేసినందుకు.
- భక్తుల రద్దీ విపరీతంగా ఉండే సమయంల్లోనూ స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీల ఏర్పాటు.
- ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ నిర్మాణాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం తద్వారా సహజరీతిలో వేడిని తగ్గించడంతో శీతలీకరణ భారం తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు నందించడం.
- విస్తారమైన పచ్చదనంతో కూడుకున్నపరిసరాలు వేడి ప్రభావాన్ని చాలావరకు నివారిస్తాయి.
- స్వచ్ఛమైన తాగునీటి లభ్యతను అందుబాటులో ఉంచడం.
- భక్తుల అవసరాలకు సరిపోయే చెరువులనునిర్మించడం.
- భక్తుల వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాలను కేటాయించడం.
- భక్తుల రవాణా నిమిత్తం నిరంతర సేవలను అందుబాటులోకి తేవడం వంటి నిబంధనలను పరిశీలించి
- ఈ అవార్డును ప్రకటించడం జరిగిందని అవార్డు ప్రకటించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY