జాతీయస్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం దేశవ్యాప్త పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మే 22, ఆదివారం సీఎం కేసీఆర్ చండీగఢ్ లో పర్యటించారు. చండీగఢ్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలు, సైనిక కుటుంబాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.
మన దేశం ఇలా ఎందుకుంది ? దీని గురించి ఆలోచించాల్సి ఉంది:
“ఇది సంతోషకరమైన విషయం కాదు.దుఃఖకరమైన విషయం. విచారకరమైన విషయమేంటంటే 75 సంవత్సరాల స్వాతంత్య్రనాంతరం కూడా మనకు ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన అగత్యం పట్టింది. కండ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా దుఃఖం వస్తోంది. మన దేశం ఇలా ఎందుకుంది ? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతీ ఒక్కరు, ప్రతీ విషయానికి సంబంధించి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితికి మూలం ఏంటి? దీనికి కారణం ఏంటి? ఈ దేశ పౌరున్ని అయినందుకు ఈ పరిస్థితి పై చర్చ జరగాలని నేను మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయి. ప్రజలు పోట్లాడాల్సి ఉంటుంది. మరణించాల్సి ఉంటుంది. జీవితాలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ నిస్సహాయత ఏమిటి? మనమే కాదు. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. సమస్యలు ప్రతీ చోట ఉంటాయి. ఏ దేశంలోనూ సమస్యలు లేవని కాదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరెక్కడా ఉండవు. కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. అమరులైన వారిని మనం తిరిగి తీసుకురాలేం. కానీ సీఎం కేజ్రీవాల్, సీఎం భగవంత్ మాన్ చెప్పినటు మీరు ఒంటరి కాదనీ, యావత్ దేశం మీతో ఉన్నదనీ సానుభూతిని ప్రకటించే ప్రజలైతే ఉన్నారు” అని సీఎం కేసీఆర్ తెలిపారు.
పంజాబ్ ఈ దేశం కోసం మహత్తరమైన భాగస్వామ్యాన్ని అందించింది:
“దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప యోధున్ని కన్న పంజాబ్ ఒక గొప్ప రాష్ట్రం, ఒక గొప్ప నేల. పంజాబ్ ఈ దేశం కోసం మహత్తరమైన భాగస్వామ్యాన్ని అందించింది. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను కన్న పంజాబ్ ను దేశం ఎప్పుడూ మరిచిపోదు. అలాగే సీఎం భగవంత్ మాన్ చెప్పినట్లు దేశం ఆహారం కోసం పరితపిస్తున్నప్పుడు ఇక్కడి రైతులు చెమటోడ్చి మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని సృష్టించి దేశానికి అన్నం పెట్టి గొప్ప భాగస్వామ్యాన్ని అందించారు. ఇదేం చిన్న విషయం కాదు. వారు గొప్ప పాత్ర పోషించారు. భారతదేశ చరిత్రలో ఈ విషయం స్వర్ణాక్షరాలతో లిఖించి ఉంది. గాల్వనో లోయలో చైనాతో జరిగిన సంఘర్షణలో మా రాష్టవాసి అయిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు పంజాబ్ సైనికులు కూడా అమరులయ్యారు. ఆ సమయంలో పంజాబ్ కు వచ్చి అమరులైన వారి కుటుంబాలను ఆదుకుందామని అనుకున్నప్పటికీ, ఇక్కడ ఎన్నికలు జరుగుతుండడం వల్ల నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపట్టకూడదని రాలేదు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయమై సంప్రదించగా వారు ఇది మంచి కార్యక్రమమని అన్నారు. మనందరం కలిసి రైతు కుటుంబాల దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం అన్నారు. వారికి నేను ధన్యావాదాలు తెలుపుతున్నాను. నా విన్నపం మేరకు మిమ్మల్ని కలిసేందుకు వారు కూడా నాతో వచ్చారు. నా తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున, మీ తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని సీఎం అన్నారు.
ప్రాణం పోయినా మేం మీటర్లు పెట్టమని తేల్చి చెప్పాం:
“సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మేము కూడా మా రాష్ట్రంలో చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఒక్కో రోజు 10 మంది, 12 మంది, 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. చాలా ఇబ్బందులుండేవి. విద్యుత్ కొరత ఉండేది. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాత్రి వ్యవసాయ మోటర్లు వేసేందుకు పోతే పాములు కుట్టేవి. చాలా ఇబ్బందికర పరిస్థితులుండేవి. ఈ బాధలు వినేవాళ్ళే ఉండేవారు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భగవంతుని దయతో విద్యుత్ సమస్యను అధిగమించాం. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం. వ్యవసాయరంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో మన తలపై కూర్చున ప్రభుత్వం మీటర్లు పెట్టాలంటోంది. లెక్కలు వేయాలంటోంది. రక్తం పీల్చమంటోంది. అసెంబ్లీ వేదికగా ప్రాణం పోయినా మేం మీటర్లు పెట్టమని తేల్చి చెప్పాం. ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకోండని తెగేసి చెప్పాం. రైతుల సంక్షేమం కోసం మాట్లాడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే వారికి నచ్చదు, పైగా ఒత్తిడి తెస్తారు. రైతు ఉద్యమ సమయంలో వారు ఎలాంటి ఆరోపణలు చేశారో మీకు బాగా తెలుసు. మిమ్మల్ని ఖలిస్తానీలన్నారు. దేశ ద్రోహులన్నారు. ఏదేదో అన్నారు. ఇవన్నీ మేము విన్నాం” అని సీఎం కేసీఆర్ చెప్పారు.
రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి:
“ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని నేను రైతు నాయకులను కోరుతున్నాను. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలనుండే కాకుండా యావత్ భారతదేశం నుండి ఈ ఉద్యమం నడవాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండి రైతులందరూ ఉద్యమంలో పాల్గొనాలి. ఇది మన హక్కు. దేశానికి, ప్రపంచానికి మనం ఆహారం అందిస్తున్నాం. పొలాల్లో చెమటోడ్చి పంట పండిస్తున్నాం. మనకు న్యాయం దక్కాలి. ఈ రకమైన దుఃఖ వాతావరణం, ఉద్యమాలు చేసే వాతావరణం పోవాలి. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. రైతులు పండించిన పంట విలువకు రాజ్యాంగపరమైన రక్షణ లభించేదాకా పోరాటం ఆపకూడదు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ అంశానికి కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి మనం మద్దతివ్వాలి. దేశవ్యాప్తంగా రైతు నాయకులు ఈ రకమైన పరిస్థితి సృష్టించినప్పుడు రైతు పండించిన పంటకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుంది. రైతు పక్షపాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఏకమవుతాయి. ఇప్పటినుంచి నడిచే ఉద్యమాలకు మేం కూడా తోడుగా ఉంటాం. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రీవాల్ తమవంతు సహాయం చేశారు. రైతులను రక్షించే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్ లను తీర్చే వరకు పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తాం. ముందుకుసాగాలని నేను రైతు నాయకులను ప్రార్ధిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కొన్ని మంచి మాటలు చెప్పి మీ మనసును శాంతపరిచేందుకు వచ్చాం. ప్రాణాలు కోల్పోయిన మీ కుటుంబ సభ్యుల ఆత్మలు శాంతించాలని భగవంతున్ని సహృదయంతో ప్రార్ధిస్తున్నాం. ఈ బాధను ఓర్చుకునే శక్తిని మీకు ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF