కొలువుదీరిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా పాలనను సాగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆది నుంచీ స్పీడుగానే దూసుకెళ్తున్నారు. ఓవైపు ప్రభుత్వ పాలన.. మరోవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు పార్టీ, నేతలు, కార్యకర్తల గురించి కూడా ఆలోచిస్తున్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. పూర్తిస్థాయి మంత్రివర్గ ఏర్పాటుకూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హోరు గాలిలోనూ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ.. ఎలాగైనా మంత్రి కావాలని పార్టీలోని కొందరు ప్రముఖులు పావులు కదుపుతున్నారు. తమను ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి కేటాయించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. మిగిలి క్యాబినెట్ బెర్త్లు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక.. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అధిష్ఠానంతో చర్చించి ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే.. రేవంత్ కొత్త టీంలో పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్అలీని మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు ఆయనకు కీలకమైన హోమ్శాఖను ఇవ్వవచ్చుననే అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన షబ్బీర్అలీ ఈసారి అక్కడనుంచి పోటీ చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆక్కడి నుంచి కూడా రంగంలో దిగడంతో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాని కనుగుణంగా రేవంత్రెడ్డి కేసీఆర్పై పోటీ చేశారు. రేవంత్ కోసం షబ్బీర్అలీ శక్తివంచన లేకుండా కృషి చేశారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యతనిస్తూ హోమ్శాఖ నివ్వవచ్చునని భావిస్తున్నారు.
అంతేకాకుండా.. గ్రేటర్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి మూడు జిల్లాల పరిధిలోనూ మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం లభించలేదు. మూడు జిల్లాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ముగ్గురు మాత్రమే గెలిచారు. వారిలో ఇబ్రహీం పట్నం నుంచి గెలిచిన సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కవచ్చుననే అభిప్రాయాలున్నాయి. ఎమ్మెల్యేలుగా గెలవకపోయినప్పటికీ, పార్టీ కోసం ఎంతో కాలంగా అవిరళ కృషి చేస్తున్న వారి సేవలను కూడా పరిగణనలోకి తీసుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టవచ్చుననే అభిప్రాయాలు సైతం ఉన్నాయి.
ఈ క్రమంలో రాజధాని నగరమైన హైదరాబాద్లోని నాంపల్లి నియోజకవర్గం నుంచి ఫిరోజ్ఖాన్ స్వల్ప ఓట్లతో మాత్రమేఓటమి పాలయ్యారు. రిగ్గింగ్, తదితరమైనవి జరిగాయనే ఆరోపణలున్నాయి. మంత్రి వర్గంలోకి ఆయనను కూడా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు గ్రేటర్ అధ్యక్షునిగానూ సేవలందించిన అంజన్కుమార్యాదవ్కు మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చుననే అభిప్రాయాలున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లోనూ గ్రేటర్ పరిధిలోని జిల్లాల నుంచి మంత్రులు లేని మంత్రివర్గం లేదు. ఈ జిల్లాల నుంచి గెలిచిన వారిలో గడ్డం ప్రసాద్కుమార్కు స్పీకర్ పదవి కట్టబెట్టారు. రెడ్డి సామాజిక వర్గం వారికే ఎక్కువ మంత్రి పదవులున్నాయనే అపవాదు ఎందుకనుకుంటే మల్రెడ్డికి అవకాశం లభించకపోవచ్చునంటున్నారు. షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్లకు ఇద్దరికీ ఇస్తే ఇద్దరూ ముస్లింమైనార్టీలే కావడాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
వీరితోపాటు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఇతర జిల్లాలకు సైతం అవకాశం కల్పించనున్నట్లు వినిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా లేని వారిని మంత్రులను చేస్తే.. ఎమ్మెల్సీలుగా గెలిపించుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గాన్ని భర్తీ చేయనున్నారు. దీనిపై రేవంత్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీకి పయనమై మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యే చాన్స్ ఉంది కాబట్టి.. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE