మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఏర్పాట్లపై హాస్పిటల్స్ సూపరింటెండెంట్ లతో చర్చించారు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కరోనా అనంతర ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. కేసులు పెరిగితే అన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల కోసం ఏర్పాటు చేసిన వార్డ్స్ ను సిద్దంగా ఉంచాలని కోరారు.
రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేయాలి:
పక్క రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ పలు కీలక సూచనలు చేశారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానంను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా లోటు లేకుండా చూడాలని ఆదేశించారు. మహారాష్ట్ర బోర్డర్ జిల్లాలు అయిన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్,ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల డిఎంహెఛ్ఓ లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వారిపై దృష్టి పెట్టాలని కోరారు. ఇతర రాష్ట్రాలనుండి ఉద్యోగాల కోసం, పనుల కోసం, పెళ్లిళ్ల కోసం వచ్చే వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాజధాని చుట్టూ ఉన్న మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హైదారాబాద్, సంగారెడ్డి జిల్లాల వైద్య అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా చూడాలని కోరారు.
వాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది:
వాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మిగిలిన గ్రూప్ వారికి కూడా త్వరలోనే వాక్సిన్ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. 102,104,108 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. పాండమిక్ గా వచ్చిన వైరస్ లు త్వరగా పోయే అవకాశం ఉండదు కాబట్టి ఇటు వైద్య అధికారులు అటు ప్రజలు రిలాక్స్ కావద్దని మంత్రి కోరారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజల యొక్క భాగస్వామ్యం తప్పనిసరి అని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న సలహాలు సూచనలు పాటించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది గుమికూడిన సందర్భంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. స్కూల్స్ లో, పరీక్ష కేంద్రాల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అని వైద్య శాఖ అధికారులను కోరారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు డా.రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ