కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు హైదరాబాద్ నగర ప్రయాణికులకు శుభవార్త అందింది. 15 నెలల అనంతరం జూన్ 23, బుధవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు మళ్ళీ పట్టాలెక్కనున్నాయి. ముందుగా ఫలక్నుమా నుంచి లింగంపల్లికి 3, లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు 3, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి 2, లింగంపల్లి నుంచి హైదరాబాద్కు 2 ఇలా మొత్తం 10 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభించనున్నారు. అనంతరం పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచనున్నారు.
ముందుగా నగరంలో ఎంఎంటీఎస్ రైలు సేవల ప్రారంభానికి సంబంధించి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. “కరోనా మహమ్మారి ప్రబలిన కారణంగా నిలిపివేయబడిన హైదరాబాద్ మహానగరంలోని ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించడమైనది. ఎంఎంటీఎస్ సేవలు హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న దిగువ, మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు, విద్యార్థులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఇంకా వివిధ రంగాల వారికి గత కొన్ని ఏళ్లుగా అత్యంత చవకైన సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం మొదట్లో నిలిపివేయబడిన సేవలు, ముఖ్యంగా దిగువ, మధ్య తరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకొని కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజల సౌకర్యార్థం పునః ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించడమైనది. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ సేవలు పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా నియమ నిబంధనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించు కోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా విజ్ఞప్తిని మన్నించి ఎంఎంటీఎస్ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు, హైదరాబాద్ మహానగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ