అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు వస్తున్న కొద్దీ.. నేతల్లో గుండెల్లో దడ మొదలవుతోంది. దీనికి తోడు ప్రచారానికి కూడా చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లలేని నేతలంతా నేతల్లో కొత్త టెన్షన్ స్టార్టయింది. దీనికి తోడు గుర్తును పోలిన గుర్తులు,పేరును పోలిన పేర్లుతో అభ్యర్దుల జాతకాలను మార్చేలా ప్రత్యర్థి పార్టీల చర్యలతో అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారింది. అలాగే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన నోముల భగత్కు కొత్తటెన్సన్ వచ్చిపడింది.
తాజాగా సాగర్లో పోటీ చేస్తున్న స్వతంత్రులకు ఈసీ కేటాయించిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు.. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండడంతో నోముల భగత్కు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ప్రత్యర్థుల నుంచే కాకుండా.. సొంత పార్టీలో ఉన్న అసమ్మతి నేతల నుంచి కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నోముల భగత్కు.. తాజాగా స్వతంత్రుల గుర్తుల రూపంలో కొత్త టెన్సన్ పట్టుకోవడంతో ఈ ఎన్నికలలో గెలుపుపై సందేహాలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి నోములకు గట్టి పోటీనే ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే సాగర్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నోముల భగత్ పేరు.. మొదటి ఈవీఎంలోనే మూడో నెంబరులో ఉంది.
అయితే అదే ఈవీఎంలో రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు కూడా ఉండడమే ఇప్పుడు నోములలో టెన్షన్కు కారణం అయ్యాయి. ఈ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ,నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 15 మంది అభ్యర్థులు ఎన్నికల సమరంలో నిలిచారు. అయితే ఇప్పుడు ఒకే ఈవీఎంలో రోలర్ గుర్తులు, బీఆర్ఎస్ కారు గుర్తు ఉండడంతో గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సూచనలతో బీఆర్ఎస్ నాయకులు.. తమ ప్రచారంలోనే ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మూడో నెంబరు గుర్తు అని దానిని ప్రత్యేకంగా చెబుతూ గుర్తుపై ఓటర్లకు అవగాహన కలిగించేలా వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.
నవంబర్ 30 వ తేదీన ఓటింగ్ జరగనుండటం.. ప్రచారానికి కూడా కొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు దెబ్బతీయడంతో ప్రత్యేకించి ఆ గుర్తులను కేటాయించవద్దని ఈసీని కోరినా.. కొన్ని గుర్తులను మాత్రం అలాగే ఉంచేసింది. దీంతో అప్పటి కష్టాలే మరోసారి ఎదురవడంతో గులాబీ నేతలలో కొత్త టెన్షన్ మొదలయింది.
2014లో జరిగిన ఎన్నికల్లో.. సాగర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తు అభ్యర్ధి ఎవరో కూడా జనాలకు పెద్దగా తెలియక పోయినా కూడా సుమారు 10 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయిన కుందూరు జానారెడ్డి 16 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. అయితే అప్పుడు రోడ్లు రోలర్కు పడిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తువేనని.. ఆ గుర్తు వల్లే తాము ఓడిపోయామని బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది.
అలాగే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా.. అలాగే కారు గుర్తు పోలిన గుర్తులు చాలా ఉండడంతో నకిరేకల్, పాలేరు, కామారెడ్డి, సంగారెడ్డి, హుజూర్నగర్, జుక్కల్ వంటి చోట్ల స్వల్ప మెజార్టీతో ఓడామని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనికి తగినట్లే లక్కడ ట్రక్కు, రోలర్ల గుర్తులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే వాదన అప్పట్లో బలంగానే వినిపించింది. ఈ సారి ఆ గండం గట్టెక్కాలని విశ్వప్రయత్నం చేసినా.. అదే సమస్య వెంటాడటంతో.. నోములలో నయా టెన్షన్ మొదలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE