తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు అందించే ప్రత్యేక ప్రత్యక్ష అవగాహన పాఠ్యాంశాలను ఫిబ్రవరి 9, గురువారం నుండి ప్రసారం చేయనున్నట్టు టీ-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, పరీక్ష సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సబ్జెక్టుల వారిగా లెక్చరర్స్ లైవ్ ద్వారా అవగాహన కల్పిస్తారన్నారు. మార్చి 15వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పాఠ్యాంశాలను టీ-సాట్ ప్రసారం చేస్తుందని చెప్పారు. టీ-సాట్ నిపుణ ఛానల్ లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు గంట పాటు ప్రత్యేక లైవ్ ప్రసారాలుంటాయన్నారు.
మరుసటి రోజు విద్య ఛానల్ లో రాత్రి 9 నుండి 10 గంటల వరకు పున:ప్రసారమౌతాయని చెప్పారు. ఒక్కో సబ్జెక్ట్ పై జరిగే ప్రత్యేక ప్రసారాల్లో భాగంగా మొదటి రోజు కెమిస్ట్రీ మరియు జువాలజీ, రెండవ రోజు బోటనీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. సబ్జెక్టులపై అవగాహనతో పాటు మానసిక అవగాహనపై ప్రత్యేక ప్రసారాలుంటాయని సీఈవో వివరించారు. సెలవు రోజులు మినహా మిగతా పనిదినాల్లో మార్చి 10వ తేదీ వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు. సబ్జెక్టులపై అవగాహన పాఠ్యాంశాలతో పాటు పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సైకాలజిస్టులు బోధించే బోధనలు విద్యార్థులు ఉపయోగించుకునే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సీఈవో శేలైష్ రెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE