తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. అయితే మొన్నటి వరకు ప్రతిపక్షాలు సైలెంట్గా ఉండడంతో రాజకీయాలు కూడా చల్లబడిపోయాయి. కానీ ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు. కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్గా చేసుకొని సంచలన వ్యాఖ్యాలు చేశారు. అసలు కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్పై కేటీఆర్ సంతకం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ను ఎండగట్టారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో మేమూ చూస్తామన్న కేటీఆర్.. అసలు ఆట ఇప్పుడు మొదలయిందని వెల్లడించారు.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతీ మాటకు తమ వద్ద రికార్డ్ ఉందని.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. అలాగే పెన్షన్ నాలుగు వేలు.. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు 15 వేలు జమ చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అందులో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. మొదటి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారని.. ఇప్పుడు ఏమయిందని కేటీఆర్ నిలదీశారు.
ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకుంటున్నారని.. అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎవరైనా అధికారంలోకి రాకముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారన్న కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇప్పుడు చూసుకుంటోందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్న కేటీఆర్.. వారు చూసుకోకపోతే తమకేం సంబంధం అని అన్నారు. తమ హయాంలో ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రం రిలీజ్ చేశామని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ