హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలను విస్తరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు.. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ టెండర్ల దశలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారుతున్నారు.
ఈక్రమంలో మెట్రో సేవల విస్తరణకు సంబంధించి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేకులు వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మంగళవారం ఎంఐఎం ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ అయిన సమయంలో మెట్రో విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలోనే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ అవసరం లేదని.. రియల్ ఎస్టేల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఆ ప్రాజెక్ట్ తలపెట్టారని రేవంత్ రెడ్డి అన్నారట.
ఇదే సమయంలో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణను రద్దు చేసి.. ఓల్డ్ సిటీని ఎయిర్ పోర్ట్కు అనుసంధానం చేసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారట. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న జేబీఎస్-ఫలక్నుమా కారిడార్ను పూర్తి చేసి.. పహాడీ షరీఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. దీని ద్వారా ఓల్డ్ సిటీ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. త్వరలో దీనిపై రేవంత్ రెడ్డి అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. రూ. 69 వేల కోట్లతో.. మేడ్చల్ నుంచి పటాన్ చెరు వరకు 29 కి.మీ.. పటాన్ చెరు నుంచి నార్సింగి వరకు 22 కి.మీ.. తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో కారిడార్ను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ