దేశంలో మరో మూడు, నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. అటు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అయినా అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
అటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో.. లేదో.. లోక్ సభ ఎన్నికల సందడి మొదలయింది. అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ. ఆ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ముందు నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్లో మాదిగల విశ్వరూప సభ నిర్వహించి.. మాదిగలకు హామీలు గుప్పించింది. మాదిగలకు బీజేపీ అండగా ఉంటుందని.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ ప్రకటించారు.
అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాదిగల ఓట్లు తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. ఆయన్ను వరంగల్ నుంచి పోటీ చేయించడం ద్వారా మాదిగల మెజార్టీ ఓట్లు తమకే పడుతాయని.. కచ్చితంగా మందకృష్ణ మాదిగ గెలిచి తీరుతారని బీజేపీ హైకమాండ్ అనుకుంటోందట. అందుకే ఆయన్ను లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోందట.
మందకృష్ణ మాదిగకు టికెట్ ఇచ్చే అంశంపై ఇప్పటికే బీజేపీ వరంగల్లో సర్వే కూడా చేయించిందట. ఆ సర్వేలో మందకృష్ణ మాదిగకు సానుకూల ఫలితాలు వచ్చాయట. దీంతో లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ వరంగల్ టికెట్ దాదాపు మందకృష్ణ మాదిగకే ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, బీజేపీ సీనియర్లు శ్రీధర్, చింతా సాంబమూర్తి కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మరి వారిని పక్కకు పెట్టి హైకమాండ్ మందకృష్ణకు టికెట్ ఇస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ