తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నదికి కూడా వరద నీరు భారీగా చేరుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందిస్తూ, మూసీ ఆయకట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో డోకా ఉండబోదని స్పష్టం చేశారు. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో చరిత్రలో ముందెన్నడూ లేనిరీతిలో ఒక్కసారిగా వరద ఉధృతి తీవ్రం కావడంతో అప్పటికప్పుడు సూర్యపేట, నల్గొండ జిల్లా కలెక్టర్ల తోపాటు నీటిపారుదల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందికి వదలాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఆయకట్టు కింది ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేసారు. అయినా వరద ఉధృతి తగ్గకపోవడంతో శాసనమండలి సమావేశంలో ఉన్న ఆయన హుటాహుటిన మూసీ ఆయకట్టు మీదకు చేరుకుని అత్యవసర ద్వారాలతో పాటు పూర్తిగా తలుపులు తీయించి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో ఆయకట్టు రైతాంగం ఊపిరి పీల్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ముందెన్నడూ ఊహించని రీతిలో వరద ఉధృతి మూసీకి చేరిందన్నారు. రెండు లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటి ప్రవాహం ఒక్కసారి మూసీకి చేరడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనదన్నారు. అయితే అధికారులు అప్రమత్తంగా ఉండడంతో అటు సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టడంతో పాటు అత్యవసర తలుపులతో సహా అన్నింటినీ తెరువడంతో 1.73 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నుండి వస్తున్న వరద ఉధృతి తో పాటు బిక్కేరు నుండి వస్తున్న వరద ఉధృతిని అంచనా వేసేందుకు నీటిపారుదల అధికారులు ఇక్కడే ఉండి సమీక్షిస్తారని ఆయన తెలిపారు. అంతే గాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి వెంట నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య సూర్యపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu