తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-వర్క్స్ ప్రారంభమైంది. ఈ మేరకు గురువారం ప్రపంచ దిగ్గజ తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియు మరియు మంత్రి కేటీఆర్ సంయుక్తంగా ప్రారంభించారు. కాగా దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ.. ఇండియాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందువరుసలో ఉందని, ఇదే విధంగా పనిచేస్తే రాబోయే నాలుగేళ్లలో డబుల్ రెవెన్యూ సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తనకు చాలా బాగా నచ్చిందని, గత ఏడేళ్లలో రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించిందో సీఎం కేసీఆర్ తనకు వివరించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ -వర్క్స్ కాన్సెప్ట్ ఆకట్టుకుందని, ఈ రాష్ట్రంతో కలిసి పనిచేయడం వల్ల ఫాక్స్కాన్ ఆదాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఏర్పడుతుందని విశ్వాసం కలుగుతోందని చెప్పారు. టీ-వర్క్స్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే టీ- వర్స్కు తమ కంపెనీ తరఫున హైఎండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను అసెంబ్లింగ్ చేసేందుకు ఉపయోగించే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ ) లైన్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.
ఇక మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద ప్రొటో టైపింగ్ సెంటర్ అయిన టీ-వర్స్ ప్రారంభోత్సవానికి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు రావడం చాలా సంతోషమని, ఇందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుపున్నానని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలుస్తోందని, దీని వెనుక సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధమైన కృషి ఉందని తెలిపారు. ఇప్పటికే ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని, అయితే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని.. ఇండియా-తైవాన్ అని సరికొత్త భాష్యం చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నదని, ఈ క్రమంలో తెలంగాణలో లక్షమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించిన యంగ్ లియుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి సాఫ్ట్వేర్ నైపుణ్యం, తైవాన్ నుంచి హార్డ్వేర్ నైపుణ్యంతో నూతన పారిశ్రామిక విప్లవానికి నంది పలుకుతామని, ఇండియా, తైవాన్ కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
సాఫ్ట్వేర్లో టెక్నాలజీ ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన టీ-హబ్ తరహాలో, హార్డ్వేర్ రంగంలో సరికొత్త వస్తువుల ఆవిష్కరణలు రూపొందించే కేంద్రంగా దీనిని నిర్మించారు. హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ కారిడార్లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ-హబ్, టీ-వర్క్స్, ఇమేజ్ టవర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 78,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-వర్క్స్ మొదటి దశ నిర్మాణం జరుపుకోగా.. ఇందులో ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్, ఇతర అంశాలపై టీ-వర్క్స్లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరించనున్నారు. అలాగే అత్యాధునిక సదుపాయం సంకలిత ప్రోటోటైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్ మరియు చెక్కడం, పీసీబీ ఫ్యాబ్రికేషన్, కుండలు, ప్రీ-కంప్లైయన్స్, మెటల్ షాప్, వెల్డ్ షాప్ మరియు చెక్క పని కోసం పరిశ్రమ గ్రేడ్ టూల్స్ మరియు పరికరాలను ఇది అందిస్తుంది. ఇక టీ-హబ్ 5.7 లక్షల చదరపు అడుగులు, టీ-వర్క్స్ ప్రస్తుతం 78 వేలు చదరపు అడుగులు ఉండగా, భవిష్యత్తులో 2.5 లక్షల చదరపు అడుగులు, ఇమేజ్ టవర్లో 1.16 చదరపు అడుగుల విస్తీర్ణంతో, మొత్తం 9 లక్షలకు పైగా చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE