జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు మార్చి 7, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు చేతుల మీదుగా నెక్లెస్ రోడ్లు లో గల జలవిహర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు చెక్కుల పంపిణీ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈసారి సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఇటీవల మరణించిన 75 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక అనారోగ్య/ప్రమాదాల బారిన పడిన 15 మంది జర్నలిస్టులకు యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఈకార్యక్రమంలో అందిస్తామని ఆయన తెలిపారు .
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమనిధి కింద ఇప్పటివరకు 260 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున రెండు కోట్ల అరవై లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని, ఆయా కుటుంబాలకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తున్నామన్నారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్కేజి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న 145 మంది విద్యార్థులకు నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును అందజేస్తున్నామన్నారు. దీనితో పాటు తీవ్ర అనారోగ్య కారణంగా పనిచేయలేని 93 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున నలభై ఆరు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయము సంక్షేమనిధి నుంచి అకాడమీ అందజేసిందని చెప్పారు. అలాగే కరోనా బారిన 1927 మంది జర్నలిస్టులకు 3 కోట్ల యాభై ఆరు లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఇప్పటి వరకు జర్నలిస్ట్ సంక్షేమనిధి నుంచి మొత్తం 9 కోట్ల 84 లక్షల 7 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టు కుటుంబాలకు అందజేసామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ