తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు నుంచి ఆహ్వానం అందింది. జనవరి 17, 2022 నుంచి జనవరి 21, 2022 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగనుంది. ఈ మేరకు ఆదివారం డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణను ప్రముఖ టెక్నాలజీ పవర్హౌస్గా మార్చడానికి మీ నిబద్ధత ప్రశంసించదగినదని మంత్రి కేటీఆర్ ను లేఖలో కొనియాడారు. ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై మీ అభిప్రాయాలు వార్షిక సదస్సులో చర్చలకు కీలకమని, అందరితో పంచుకోవాలని కోరారు.
మరోవైపు డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సుకు ఆహ్వానం రావడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీ మరియు ఇన్నోవేషన్ రంగాలలో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఆహ్వానం వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుతున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను తెలియజేస్తూ, గ్లోబల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వివరణ ఇచ్చేందుకు ఇది మరొక అవకాశమని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తొలిసారిగా 2017లో డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం అందుకున్నారు. 2017, 2018, 2019, 2020 డబ్ల్యూఈఎఫ్ సదస్సుల్లో కూడా పాల్గొని తెలంగాణలో పెట్టుబడికి గల అవకాశాలను పలువురు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలకు, సంస్థలకు వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ