తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై బుధవారం నాడు రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని చెప్పారు. కంపెనీలు వారికి కేటాయించిన ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. “ఫ్యాక్టరీ జోన్లలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఉద్యానశాఖకు నివేదిక అందించాలి. రాబోయే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం. ఇప్పటివరకు 15 జిల్లాలలో 8 కంపెనీలకు 4 లక్షల 61 వేల 300 ఎకరాలు కేటాయించాం. ఉద్యానశాఖతో ఒప్పందం ప్రకారం కంపెనీలు సకాలంలో ఆయిల్ పామ్ పంటలను సాగులోకి తేవాలి. నీటి వసతి, ఆయిల్ పామ్ సాగుకి అనువైన నేలలు కలిగి ఉన్న రైతులను ఉద్యాన శాఖ సహకారం తో కంపెనీలు ఎంపిక చేసుకోవాలి. రైతులకు మేలైన ఆయిల్ పామ్ మొక్కలను సరఫరా చేసే బాధ్యత కంపెనీలదే. వీలైనంత త్వరగా ఆసక్తిగల రైతులకు మొక్కలు అందించాలి. ఈ విషయంలో ఆయిల్ ఫెడ్ కంపెనీలకు సహకారం అందించాలి” అని మంత్రి పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను రైతులకు అర్ధమయ్యేలా వివరించాలి:
“అలాగే ఐఐఓపీఆర్ మార్గదర్శకాలను అనుసరించి కంపెనీలు నర్సరీలు ఏర్పాటు చేయాలి. అధిక నూనె ఇచ్చే మేలైన రకాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేయాలి. రైతులు మొక్క నాటడం నుండి పెంపకం, తోటల నిర్వహణ, గెలల కోత ఇలా ప్రతి దశలో సాగు, సాంకేతిక మెళకువలు సహకారం ఇచ్చేందుకు అయిల్ పామ్ సాగులో అనుభవం గల వ్యవసాయ పట్టభద్రులను కంపెనీలు తగినంత మందిని నియమించుకోవాలి. వెంటనే కంపెనీలు ఉద్యోగుల నియామకాలు చేపట్టాలి. రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి సమావేశాలకు స్వయంగా హాజరవుతాను. రైతులకు ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలు అర్ధమయ్యేలా తగినంత సమాచారం సరళమైన భాషలో అందించాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ నిర్మల, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, నాబార్డు, ఎస్ఎల్ బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ