తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జరిగిన వేడుకలలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో అలుపెరగని పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ సాధనలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని, వారి త్యాగ ఫలంతో సిద్దించిన ఈ రాష్ట్రం వారిని ఎన్నడూ మర్చిపోదని స్ఫష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో అన్ని రంగాలలో అద్భుతంగా అభివృద్ధి సాధిస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాంగా నిలిచిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో, అధికారుల కృషితో తెలంగాణ నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మరోవైపు సిద్దిపేట కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకటం తెలంగాణ చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆయన సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పురోగమిస్తోందని, ప్రజల జీవన విధానం మెరుగుపడిందని వెల్లడించారు. విద్యా, వైద్య ఆరోగ్య రంగాలలో కానీ, మిషన్ భగీరథ, హరితహారం వంటి పథకాలు కానీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో అద్భుత ప్రగతిని సాధించామని, మన బడి ద్వారా పాఠశాలలను బాగుచేసుకుంటున్నామని అన్నారు. అలాగే ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో తీవ్ర ఇక్కట్లకు లోనవుతుంటే, తెలంగాణలో మాత్రం వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF