అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలోనే తలామునకలవుతోంది. రెండు మూడు రోజులుగా.. ఈరోజు వస్తుంది.. రేపు వస్తుంది అంటూ ఆ పార్టీ దిగ్గజ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అభ్యర్థుల జాబితా రోజురోజుకు ఆలస్యం అవుతుండడంతో.. ఆ పార్టీ నేతలు గబులు చెందుతున్నారు. అయితే ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ అయినట్లు తెలుస్తోంది. శనివారం పక్కాగా 55 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారం అర్థరాత్రి వరకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై మంతనాలు జరిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అభ్యర్థుల తొలి జాబితాకు బీజేపీ ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు అధికారికంగా ఆ జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా మహిళలకు, బీసీలకు సీట్లు దక్కేలా తొలి జాబితాను రూపొందించినట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్తో పాటు.. సీఎం కేసీఆర్పై గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ నుంచి.. ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి, రఘునందన్నావు దుబ్బాక నుంచి.. డికె అరుణ గ్వాల నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు గోషామహల్ టికెట్ ఈసారి ఎవరికి ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఏడాది క్రిత ఓ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరినప్పటికీ.. అధిష్టానం అందుకు అంగీకరించలేదు. దీంతో ఈసారి రాజాసింగ్కు టికెట్ దక్కడం కష్టమేనని అంతా భావించారు.
సరిగ్గా అదే సమయంలో ఓ యువనేత పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు.. విక్రమ్ గౌడ్కు గోషామహల్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అటు విక్రమ్ గౌడ్ కూడా కొద్దిరోజులుగా గోషామహల్లో యాక్టివ్గా ఉంటూ.. జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లకు దగ్గరగా ఉంటున్నారు. నియోజకవర్గంలో కూడా విక్రమ్ గౌడ్కు టికెట్ కన్ఫార్మ్ అని అంతా భావించారు.
ఇక గోషామహల్ టికెట్పై రాజాసింగ్ ఆశలు వదిలేసుకుంటున్న క్రమంలో.. ఆయనకు ఊరట కల్పించే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాజాసింగ్పై అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోషామహల్ టికెట్ రాజాసింగ్కే కేటాయిస్తూ.. తొలి జాబితాలో ఆయన పేరు చేర్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. బీజేపీ తొలి జాబితా రావాల్సిందే.