తెలంగాణలో వలసలతో ఆయా పార్టీల్లో రాజకీయాలు సలసల కాగుతున్నాయి. అసంతృప్తులతో రాష్ట్రంలో వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆపార్టీ నుంచి వెళ్లేవారు దాదాపుగా ముగిసిపోయారు. కాంగ్రెస్ పూర్తి జాబితా వెల్లడి కాలేదు. బీజేపీ జాబితా అసలే రాలేదు. ఆ రెండు పార్టీల పూర్తి జాబితాలు వెల్లడై అభ్యర్థులెవరో తెలిస్తే, ఆ రెండు పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరగనున్నాయి.
ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల నుంచి మొదలైన వలసల వరుస ప్రస్తుతం రావుల చంద్రశేఖరరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి,ప్రొఫెసర్ కోదండరామ్,డా. చెరుకు సుధాకర్ల వద్ద నిలిచింది. వీరిలో ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధపడ్డారు. అది వలస కాదు. ఒక ఒప్పందం మాత్రమే అయినా మారుతున్న రాజకీయాల్లో అర్థాలు మారుతున్నాయి. ఎవరికి తోచినట్టుగా వారుగా అన్వయించుకుంటున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ హస్తం చేజారారు. ఉద్యమసమయంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు పార్టీ పొలిట్బ్యూర్సభ్యుడిగా ఉండి,అనంతరం తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేసిన సుధాకర్ అనంతరం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పాలమూరులో జూపల్లి కృష్ణారావులు బీఆర్ఎస్ను వీడుతున్నారంటూ వెలువడిన వార్తలతో మొదలైన వలసలు అన్ని పార్టీల్లో కొనసాగుతున్నాయి. ఉన్న పార్టీలో అసంతృప్తులను గుర్తించి వైరి పక్షాలు విసురుతున్న వలలో చిక్కుకుంటున్నారో, లేక వారే వలచి వెళ్తున్నారో సదరు నేతలకే తెలియాలి. ఒకరా ఇద్దరా ఆపార్టీ నుంచి ఈ పార్టీలోకి ..ఈ పార్టీనుంచి ఆ పార్టీలోకి మారుతున్న వారి గురించి ఓసారి గుర్తు చేసుకుంటే ..పైన పేర్కొన్న ముగ్గురితోపాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే ముద్దగాని రామ్మోహన్గౌడ్, ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్, తదితరులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు.వీరితోపాటు కొందరు కార్పొరేటర్లు సైతం వీరిబాటలోనే కాంగ్రెస్వైపు వెళ్లారు. కార్పొరేటర్లలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన వారిలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జిట్టా బాలకృష్ణారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి, మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తదితరులున్నారు. టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సైతం రాజకీయ బాట పట్టి బీఆరెస్లో చేరారు. వీరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి ఉద్యమ సమయంలో బీఆర్ఎస్లో చురుగ్గా ఉండగా,అనంతరం బీజేపీ, కాంగ్రెస్లలోకి వెళ్లారు. తిరిగి సొంతగూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బి.వెంకట్రెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు.కార్పొరేటర్లు,సర్పంచ్లు, నియోజకవర్గ స్థాయి నేతలు వందల సంఖ్యలో బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు.