తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) పేరుతో నూతన జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని, అన్ని రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్కు భారీ స్పందన వస్తోందని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. అయితే బీజేపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని సూచించారు. గురువారం ఆమె నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి సహా పలువురు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని, మున్ముందు కూడా ఇదే రీతిలో ప్రజల మద్దతు ఆయనకు అందించాలని కోరారు. పేదరికంతో పిల్లల పెళ్లిళ్లు చేయలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసమే ఈ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.లక్షా 116 సాయం అందిస్తోందని, ఇలాంటి పథకం దేశంలోనే లేదని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ నిజామాబాద్ పట్టణంలో బహిరంగసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని హైటెక్స్ లాంటి పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం ఇక్కడ కూడా జరగాలని, దీనికోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నానని ప్రకటించారని గుర్తుచేశారు. ఇక పట్టణంలో పాత కలెక్టరేట్ వంటి భవనాలను కూల్చివేసి వాటిస్థానంలో కళాభారతిని, మైనార్టీల కోసం హజ్హౌస్ వంటి ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ