గులాబీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫస్ట్ నుంచీ కూడా అంతు చిక్కని జిల్లాగానే మిగిలిపోయింది. ఖమ్మం ఖిల్లా రెండు ఎన్నికల్లోనూ కారు పార్టీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు తనను ధిక్కరించిన తుమ్మల నాగేశ్వరరావు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎలాగైనా అక్కడ ఓడించాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఖమ్మం జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారట. అందుకే ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నతమ పార్టీ అభ్యర్థులను ఆరు నూరైనా అక్కడ గెలిచి తీరాలని హుకుం జారీ చేశారట.
2014, 2018 లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పాగా వేయడం కాదు కదా కనీసం పునాదులు కూడా వేసుకోలేకపోయింది. రెండుసార్లు కూడా అక్కడ ఒక్కో సీటు మాత్రమే గెలిచి నామమాత్రపు పరువును మాత్రం కాపాడుకుంది. అయితే ఈ సారి పార్టీ లెక్కలు మారాయని కాస్త ధీమాగా ఉన్నారు గులాబీ బాస్. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరిగినట్లు అయిందని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అందుకే ఈసారి పదికి పది స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్ పట్టుబట్టారు. అందులో భాగంగానే ముందు నుంచీ కుండా ఉమ్మం ఖమ్మం జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు.
అయితే ఇప్పటి వరకూ కారుతో ప్రయాణం చేసిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి సెగలతో ప్రత్యర్థి పార్టీలో చేరడమే కాదు.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బరిలో నిలవడంతో వారిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నియోజకవర్గం అయిన ఖమ్మంలో ఈ సారి హస్తం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అదే విధంగా పాలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలబడుతున్నారు.ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పట్టు బిగించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలనే పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నారు.
నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దమ్మున్న నాయకులుగా పేరు బడ్డారు.అంతేకాదు వీరిద్దరికీ జిల్లా అంతటా అనుచర బలగం గట్టిగానే ఉంది. దీనికి తోడు ఇటు తుమ్మల, అటు పొంగులేటి రెండు బలమైన సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా తమ ప్రభావం చూపగలుగుతారని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. అయితే వీరిద్దరినీ కేసీఆర్ పక్కన పెట్టడంతో.. అసంతృప్త రాగం అందుకుని ఇద్దరు కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. ఆ ఇద్దరి నేతల బలాలు తెలుసుకోవడంతో పాటు.. బీఆర్ఎస్కు పక్కలో బల్లెంలా తయారవ్వాలనే లెక్కలతో తుమ్మలకు, పొంగులేటికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓడించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. పిట్టకథను చెప్పడానికి గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. ఇన్ని రోజులు వీక్ గా ఉన్న కారు పార్టీ బలోపేతం అయిందనే సంకేతాలు పంపడంతో పాటు.. ఖమ్మంలో కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని నిరూపించడానికి ఇదే సరైన సమయం అని కేసీఆర్ చెప్పాలనుకోవడంతో.. ఖమ్మం వైపే సీఎం కాన్సన్సన్ట్రేషన్ పెంచుతున్నారు. అందుకే ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్తో… పాలేరు నియోజకవర్గం అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డితో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
మరోవైపు రెండు నియోజకవర్లాల్లోనూ నెలకొన్న తాజా పరిణామాలను, పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడి నేతల నుంచి ఇతర ముఖ్యమైన నేతల వరకూ సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్.. కేసీఆర్ అందిస్తోన్న జోష్తో ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో.. దూకుడు పెంచి ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు. అయితే అటు తుమ్మల నాగేశ్వరరావు కూడా తగ్గేదేలే అన్నట్లుగా.. ఈ ఎన్నికలతో పువ్వాడ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అంటూ ధీమాగా తన ప్రచారం సాగిస్తున్నారు. పాలేరులో కూడా కందాల, పొంగులేటి మధ్య పొలిటికల్ పోరు రసవత్తరంగా సాగుతోంది.
అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరులో బలమైన క్యాడర్ ఉండటం బాగా కలిసి వస్తుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రాజకీయాలలో రాత్రికి రాత్రి అంచనాలు తలక్రిందులయ్యే చాన్స్ ఉండటంతో.. కందాల ఉపేందర్రెడ్డిని ఏమాత్రం లైట్ తీసుకోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు . బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని.. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఫోకస్ పెంచడంతో..అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ కోసం పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్స్ తిప్పికొట్టడానికి కాంగ్రెస్ నేతలు కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జిల్లాలో పొలిటికల్ వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ