తెలంగాణలో మరికొద్ది రోజుల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏఏ నియోజకవర్గాలలో ఎక్కువ మంది ఓటర్లున్నారు? ఏ ఏ నియోజకవర్గాలలో తక్కువ మంది ఓటర్లున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. నిజానికి అక్టోబర్ 4న ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం చూసుకుంటే.. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 ఉండగా..అందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339గా ఉంది.
మరోసారి తుది ఓటర్ల జాబితా ఈ రోజు వరకూ అంటే అక్టోబర్ 30 వరకు ఓటర్ నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్యలో కొద్దిపాటి మార్పులు రావొచ్చు. మొత్తంగా తెలంగాణలో ఓటర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం శేరిలింగంపల్లి కాగా.. ఓటర్ల సంఖ్యపరంగా అతి చిన్న నియోజకవర్గంగా భద్రాచలంలో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నియోజరవర్గం.. రంగారెడ్డి జిల్లాలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్న శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 6,98,079 మంది ఓటర్లున్నారు. శేరిలింగంపల్లిలో పురుష ఓటర్లు 3,70,301 మంది ఉండగా మహిళా ఓటర్ల సంఖ్య 3,27,636 గా ఉంది. 142 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. ఇలా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండడంతో.. ఏకంగా 622 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
నియోజకవర్గాల డీ లిమిటేషన్ తర్వాత అంటే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తరువాత 2009లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం అరికపూడి గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలలో అరికపూడి గాంధీ అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణలో 5 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాలో.. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. కుత్బుల్లాపూర్లో 6,69,253 మంది ఓటర్లు.. మేడ్చల్లో 5,95,382 మంది ఓటర్లు, ఎల్బీనగర్లో 5,66,814 మంది ఓటర్లు, అలాగే రాజేంద్ర నగర్లో 5,52,363 మంది ఓటర్లు ఉన్నారు. మహేశ్వరంలో 5,17,241 మంది ఓటర్లు, ఉప్పల్లో 5,10,187 మంది ఓటర్లున్నారు.తెలంగాణలో మరే అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య 5 లక్షలకు మించలేదు.
తెలంగాణలోనే అత్యంత చిన్న అసెంబ్లీ నియోజకవర్గం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం(ఎస్టీ) నియోజకవర్గంలో ఓటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. భద్రాచలం నుంచి ప్రస్తుతం పొడెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. భద్రాచలంలో మొత్తం 1,46,064 మంది ఓటర్లు ఉన్నారు.అందులో 70,151 మంది పురుషులు ఉండగా, 75,909 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో 4 ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 176 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే భద్రాద్రి జిల్లాలోనే అశ్వారావుపేట(ఎస్సీ) నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2 లక్షల మంది కంటే తక్కువే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,53,757 మంది ఓటర్లున్నారు. ఇలా రెండు లక్షల కంటే తక్కువ సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గాలలో.. ఖమ్మం జిల్లాలో వైరా(ఎస్టీ), భద్రాద్రి జిల్లాలో పినపాక(ఎస్టీ), సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, కామారెడ్డి జిల్లాలో జుక్కల్(ఎస్సీ), నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడ, మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి(ఎస్సీ), చెన్నూరు(ఎస్సీ) ఉన్నాయి.ఇలా 2 లక్షల మంది కంటే తక్కువ ఓటర్లున్న ఈ 9 నియోజకవర్గాలలో కూడా పురుషల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉన్నారు.
2018 ఎన్నికలలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 48.61 శాతం మంది మాత్రమే.. తమ ఓటు హక్కు వినియోగించుకోగా, తక్కువ ఓటర్లు ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం 80.41 శాతం పోలింగ్ నమోదయి అధికారులను ఆశ్చర్యపరిచింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరుగగా.అరికపూడి గాంధీ రెండు సార్లు విజయం సాధించారు. 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో టీఆర్ఎస్ నుంచి గాంధీ గెలవగా ..అంతకంటే ముందు 2009లో కాంగ్రెస్ నుంచి భిక్షపతి యాదవ్ ఇక్కడ గెలిచారు.
మరోవైపు తక్కువ మంది ఓటర్లున్న భద్రాచలం నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఒక్కసారి తప్ప అన్నిసార్లూ వామపక్షాలు, కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తూ రికార్డులు నెలకొల్పారు.మొట్టమొదటి సారి అంటే 1952లో జరిగిన ఎన్నికలలో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థి గెలిచారు. తాజాగా ఇప్పుడు మారిన సమీకరణాలతో ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ