రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తూ ఉంటుంది. అందుకే అప్పటివరకూ ప్రత్యర్ధి పార్టీల తరపున కారాలు , మిరియాలు నూరిన ఆ నేతలే తర్వాత దోస్తానా కట్టడం కనిపిస్తూనే ఉంటాయి. నువ్వు ఒకటి అంటే నే రెండంటా అన్నట్లుగా కనిపించిన ఆ నాయకులే తర్వాత ఆత్మీయ ఆలింగనాలతో మునిగిపోవడం కూడా చూస్తూనే ఉంటాం. అలా ఇప్పుడు ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్ , ఎంఐఎంలు జత కడతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అవును తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత ఇప్పుడు పొత్తుల రాజకీయం తెర మీదకు వచ్చింది. ఎన్నికల్లో బీజేపీ , జనసేనతో పొత్తు పెట్టుకోగా కాంగ్రెస్, సీపీఐ మాత్రమే పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. కానీ బీఆర్ఎస్, ఎంఐఎం, బీఎస్పీ, సీపీఎం పార్టీలు మాత్రం వేర్వేరుగా బరిలో నిలిచాయి. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం అలాగే 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయడం.. అసెంబ్లీ కొలువుదీరడం కూడా జరిగిపోయింది. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతో.. రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ను కొద్దిలో దాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారం చేజారిపోకుండా పొత్తుల కోసం చూస్తోందా అన్న చర్చ నడుస్తోంది. అర్హులైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నా.. ఎంఐఎంకు ప్రొటెం స్పీకర్ పదవిని ఇవ్వడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంఐఎంకు దగ్గరవ్వడానికి, లోక్సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు పొందడం కోసం, తెలంగాణలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే కాంగ్రెస్ పార్టీ.. అక్బరుద్దీన్కు ప్రొటెం స్పీకర్ పదవి ఇచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రొటెం స్పీకర్, స్పీకర్, వైస్ స్పీకర్ ఇలా పదవి ఏదైనా సరే అధికారాలు సమానంగానే ఉంటాయి. అయితే ప్రొటెం స్పీకర్ కాలపరిమితి .. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు కానీ కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు మాత్రమే కుర్చీలో కూర్చునే పదవిగా చెబుతారు. అయితే బీఆర్ఎస్ పాలనతో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం చాలా పనులు చేయించుకుంది. ఇప్పుడు ఈ పరిమిత పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్తో దోస్తీ చేస్తుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్-ఎంఐఎం దోస్తీ ఇప్పట్లో తేలే అవకాశం లేకపోయినా.. లోక్సభ ఎన్నికల సమయానికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్, ఎంఐఎంలపైన ఒకవైపు చర్చ జరుగుతూ ఉండగానే.. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమవడంపై పొలిటికల్ సర్కిల్లో మరో చర్చ కొనసాగుతోంది. ఈ భేటీలో పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. అయితే సీంఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సమావేశానికి ముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం సీఎం కేసీఆర్ను పరామర్శించారు. కేసీఆర్ను కలిసిన తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ కావడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీస్తోంది. మరోవైపు ఎన్నికల సమయంలో ఎంఐఎం నేతలతో వాదనలకు దిగిన రేవంత్..ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించడం ఏంటా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE