తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలుకుతాం.. కుటుంబ పాలనను అంతమొందిస్తాం.. రాజన్న రాజ్యం తీసుకొస్తామని మొన్నటి వరకు గొంతెత్తి అరిచారు వైఎస్ షర్మిల. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి పోరుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కేసీఆర్పై యుద్ధమే చేశారు. పాదయాత్ర సమయంలో బీఆర్ఎస్ సర్కార్పై విమర్శల వర్షం గుప్పించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సమయంలో.. విద్యార్థులకు అండగా పోరాటం చేసి రచ్చ చేశారు. ఆ సమయంలోనే అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత కూడా కేసీఆర్ సర్కార్పై పోరాటం కొనసాగించారు.
అయితే ఆ తర్వాత కొద్దిరోజులకు ఒక్కసారిగా షర్మిల సైలెంట్ అయిపోయారు. ఎందుకు అలా మౌనం పాటించారో ఎవరికీ పాలుపోలేదు. ఆ తర్వాత ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద ప్రత్యక్షమై షర్మిల అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. పలుమార్లు పరోక్ష్యంగా కూడా దీనిపై షర్మిల స్పందించారు. ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా షర్మిల సమావేశమయ్యారు. ఇక కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ మెర్జ్ అవ్వడం కన్ఫామ్ అని అంతా భావించారు.
కానీ అందరి ఊహలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్తో వైఎస్సార్టీపీ విలీనం మధ్యలోనే ఆగిపోయింది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అతని అనుచరులు అడ్డుగా ఉండడంతో.. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం కాలేదని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ముందు నుంచి రేవంత్ రెడ్డి అంటే కాస్త గుర్రుగా ఉండే షర్మిల.. ఈ దెబ్బతో ఆయనపై మరింత కోపం పెంచుకున్నారు. రేవంత్కు షాక్ ఇవ్వాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న షర్మిల సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు షర్మిలకు రేవంత్ రెడ్డిపై రివేంజ్ తీసుకునే సమయమొచ్చింది. ముందు నుంచి షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రెండు చోట్ల పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారట. రేవంత్ రెడ్డి అడ్డా అయిన.. కొడంగల్లో కూడా పోటీ చేసేందుకు షర్మిల రెడీ అవుతున్నారట. కాంగ్రెస్ తరుపున కొడంగల్లో రేవంత్ రెడ్డి పోటీ చేయడం పక్కా. అటు బీఆర్ఎస్ టికెట్ పట్నం మహేందర్ రెడ్డికి దక్కింది. ఈక్రమంలో షర్మిల కూడా కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నారట. రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొడంగల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారట.
పోయిన సారి కొడంగల్లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అటు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో షర్మిల అక్కడ ఎంట్రీ ఇస్తే.. రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మరి నిజంగానే షర్మిల కొడంగల్ నుంచి కూడా పోటీ చేస్తారా? రేవంత్ రెడ్డికి షాకిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.