స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా అనేక చోట్ల ఫ్రీడం ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమాలలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దీనిలో భాగంగా 750 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, ఎమ్మెల్యే మానిక్ రావు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మరోవైపు వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండలో శనివారం ‘ఫ్రీడం ర్యాలీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణం లోని పోలీస్ హెడ్ క్వాటర్స్ నుంచి జేఎన్ఎస్ వరకు నిర్వహించిన ఈ ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలని, ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 16న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామూహిక స్వాతంత్య్ర జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ మైదానం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరికి కనీస అవసరాలైన విద్య, ఉద్యోగం, ఉపాధి వంటివి లభించినప్పుడే నిజమైన అభివృద్ధిని సాధించినట్లని మంత్రి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY