కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని “రైతు సంఘర్షణ సభ”లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అంత తేలికగా ఏర్పడలేదని, ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు చేసిన ప్రాణత్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని, అందుకే ఆనాడు పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు రాహుల్ గాంధీ.
కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకే కుటుంబం మాత్రమే బాగుపడిందని, అది సీఎం కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పక్కనే ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2,500 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తోందని, మరి ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణాలో ఎందుకు తక్కువ మద్దతు ధర ఇస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే.. 2 లక్షల రూపాయలు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని, 15 వేల రూపాయలు పంట పెట్టుబడి కోసం అందిస్తామని డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంత పెద్ద నాయకులైనా, కార్యకర్తలైనా.. ఎవరైనా సరే బీజేపీ పార్టీతో కానీ, టీఆర్ఎస్ పార్టీతో కానీ సంబంధాలు పెట్టుకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనాయకులు అందరూ హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ