తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా శాంతి కుమారి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో తనకు సీఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ ని కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ నూతన సీఎస్ గా బీఆర్కే భవన్లోని సీఎస్ ఛాంబర్లో బుధవారం సాయంత్రం శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతి కుమారికి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE