ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అవిశ్వాసాల తీర్మానాల జోరు కొనసాగుతోంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో అసంతృప్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్మన్, మేయర్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. క్యాంప్ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఆసక్తికర రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అవుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మునిసిపల్ చైర్మన్లు, మేయర్ల మెడపై అవిశ్వాస తీర్మానాల కత్తి వేలాడుతోంది. ఇప్పటికే కొందరిపై ఆ తీర్మానాలు ఆమోదం పొందాయి. ఇక రేపోమాపో వారు సీటు దిగిపోతారనుకుంటున్న తరుణంలో కొత్తచట్టంలో రూపు దిద్దుకోని రూల్స్ వారికి ఉపశమనం కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలువురు మునిసిపల్ చైర్మన్లపై అవిశ్వాత తీర్మానాలు ఆమోదం పొందాయి. తాము పదవినుంచి దిగిపోవడానికి సుతరామూ ఇష్టపడని కొందరు తమ పదవులు కాపాడుకునేందుకు హైకోర్టు నాశ్రయించారు.తమ పోస్టు ఊడిపోకుండా స్టే ఇవ్వాలని కోరుకున్నారు. వారి విజ్ఞప్తుల్ని సింగిల్ జడ్జి తిరస్కరించడంతో రిట్ అప్పీలు దాఖలు చేసుకున్నారు. దానిపై విచారణ ప్రారంభించిన డివిజన్ బెంచ్ అవిశ్వాస తీర్మానాలు ఆమోదం పొందితే పదవి కోల్పోయే అంశానికి సంబంధించి మునిసిపల్ కొత్త చట్టంలో రూల్స్ లేకపోవడంతో విచారణను తిరిగి ఈనెల 29కి వాయిదా వేసింది. దీంతో కోర్టునాశ్రయించినవారికి ఉపశమనం కలిగినట్లయింది. తామిక ‘స్టే’బుల్గా ఉండవచ్చని ఆశపడుతున్నారు.
ఉమ్మడి ఏపీ మునిసిపల్ యాక్ట్ మేరకు పురపాలికల్లో మూడింట రెండొంతుల మంది వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లె లిపితే చైర్మన్లు దిగిపోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో తెచ్చిన తెలంగాణ మునిసిపాలిటీస్ యాక్ట్లో అలా లేదు.అవిశ్వాస తీర్మానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికీ ఎలాంటి రూల్స్ అంటూ రూపొందించలేదు. ఇదే అంశాన్ని కోర్టునాశ్రయించిన చైర్మన్ల తరపు లాయర్లు కోర్డు దృష్టికి తెచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానాలు ఆమోదం పొందినా వారిని దింపేందుకు వీల్లేదంటూ వాదించారు. ఆమోదం తర్వాత తదుపరి చర్యలకు సంబంధించి తగిన నిబంధనలు లేవని పేర్కొన్నారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో కానీ అప్పటి వరకు చైర్మన్లకు ఉపశమనం లభించింది. స్టే ఉత్తర్వులు రాగలవని ఆశపడుతున్నారు.
ఇదిలాఉండగా.. తమపై అవిశ్వాస తీర్మానాలు నెగ్గడంతో హైకోర్టు మెట్లెక్కిన చైర్మన్లలో సదాశివపేట మునిసిపల్ చైర్మన్ పి.జయమ్మ, ఆందోల్ మునిసిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య,ఆలేరు మునిసిపల్ చైర్మన్ వి.శంకరయ్యలతోపాటు జవహర్నగర్ మేయర్ మేకల కావ్య ఉన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న మునిసిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లపై అవిశ్వాస తీర్మానాల పరంపర మొదలైంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇది తలనొప్పిగా మారుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE