తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో “రైతు సంఘర్షణ” సభ నిర్వహించింది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనాయకులు అందరూ హాజరయ్యారు. ఈ రైతు సంఘర్షణ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ అధికారంలోకి రాగానే ఈ డిక్లరేషన్ ను అమలు చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ లోని అన్ని అంశాలను రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ లోని అంశాలివే:
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏక కాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.
- “ఇందిరమ్మ రైతు భరోసా” పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తాం. ఉపాధి హామీ లో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తాం.
- రైతులు పండించిన అన్ని పంటలకు (ఉదాహరణకు వరి, పత్తి, మిర్చీ, చెరకు, పసుపు, మామిడి, బత్తాయి తదితర పంటలు) మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
- తెలంగాణలో మూతబడిన చెక్కెర కర్మాగారాలను తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరకు, పసుపు రైతులకు పూర్వవైభవం తెస్తాం.
- రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి, ప్రకృతి విపత్తుల వల్లనో, మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి, నష్ట పరిహారం అందేలా చూస్తాం. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తాం.
- పోడు భూములలో వ్యవసాయం చేస్తున్న రైతులకు యాజమాన్య హక్కు పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూములు కేటాయించబడిన లబ్దిదారులకు ఆ భూమిపై యాజమాన్య హక్కులు, క్రయ-విక్రయ హక్కులు కల్పిస్తాం. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేసి, అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా, ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకు వస్తాం.
- నకిలీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకై కఠిన చట్టాలు తెచ్చి, కారణమైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం ఇప్పిస్తాం. పీడీ యాక్టు కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- నిర్దిష్ట సమయ ప్రణాళికతో పాటు అవినీతి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చేస్తాం.
రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం చట్ట పరమైన అధికారాలతో - “రైతు కమిషన్” ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం-పంటల ప్రణాళికను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.
- వరి ధాన్యం మద్దతు ధర రూ.1960 కాగా రూ.2500 కి పెంచి కొనుగోలు చేస్తాం. మొక్కజొన్న మద్దతు ధర రూ.1870 కాగా రూ.2200కు, కందులు మద్దతు ధర రూ.6300 కాగా రూ.6700కు, సోయాబిన్ మద్దతు ధర రూ.3950 కాగా రూ.4400కు, పత్తి మద్దతు ధర రూ.6025 కాగా రూ.6500కు, జొన్నల మద్దతు ధర రూ.2758 కాగా 3050 కు కొనుగోలు చేస్తామని డిక్లరేషన్ లో ప్రకటించారు. అలాగే మిర్చి రూ.15000కు, పసుపు రూ.12000కు, ఎర్రజొన్న రూ.3500కు, చెరుకు రూ.4000కు కొనుగోలు చేస్తామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ