తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ల మధ్య కాంగ్రెస్ శాసనసభ పక్ష (సీఎల్పీ ) కార్యాలయంలో శుక్రవారం సమావేశం జరిగింది. ముందుగా సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు మీడియా ప్రతినిధులు చేరుకోగా ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇరువురూ నేతలు సమావేశమై 20 నిమిషాల పాటుగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంపై రేవంత్ రెడ్డి గాని, జగ్గారెడ్డి గాని ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ చేప్పట్టే కార్యక్రమాలు, ఇతర పరిణామాలు, జగ్గారెడ్డి రాజీనామా అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది.
అయితే గతకొన్ని రోజులుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కోసం ఎంతో శ్రమించినా అవమానిస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొందరు కుట్రలు చేశారని పరోక్షంగా రేవంత్ రెడ్డి వర్గంపై జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటనపై కూడా తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కలుసుకుని సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా భేటీతో తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్ ముగిసినట్టేనా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ