తెలంగాణలో నిరుద్యోగం అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే రెండురోజుల క్రిందట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు జరిగిన నిరసన ర్యాలీ మరియు అంబేడ్కర్ చౌక్లో కార్నర్ మీటింగ్ నిర్వహించింది. ఈ క్రమంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులతో సమావేశమవనున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి నల్గొండ బైపాస్ నుంచి పట్టణం వరకు మూడు కిలోమీటర్ల మేర నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సుమారు వెయ్యి మంది నిరుద్యోగులు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాత పెద్ద గడియారం సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కాగా నల్గొండలో ఈనెల 21న నిరసన ర్యాలీ నిర్వహించాలని ముందుగా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే తమతో సంప్రదించకుండా తమ సొంత జిల్లాలో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి , వెంకట్ రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరవుతారా? లేదా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి. అయితే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో.. తాము సభకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు వారిద్దరూ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్కు సమాచారం అందించారు. ఇక వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్లో నిర్వహించనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొననున్నారని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE