నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను రైతులు అప్పగించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన తర్వాత పనులు ఊపందుకున్నాయి. పాలనకు ప్రధాన అవసరమైన సచివాలయం, అసెంబ్లీలను తొలుత తాత్కాలికంగా సిద్ధం చేశారు. 2017 నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు. 2019 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. తాత్కాలికంగా కాదు.. రాజధానికి శాశ్వత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో శక్తికి మించి వనరులను సేకరించి.. శాశ్వత వసతి కోసం పలు భవన నిర్మాలను మొదలుపెట్టారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.
చంద్రబాబునాయుడి హయాంలో ఉండగానే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు కూడా 90 శాతం పూర్తి అయ్యాయి. గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ ఉద్యోగుల క్వార్టర్స్ పనులు సగం పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు కొంత పూర్తయ్యింది. కీలకమైన సెక్రటేరియేట్ టవర్స్ నిర్మాణ పనులు పునాది దశలో ఉన్నాయి. జడ్జీల క్వార్టర్స్ కూడా పనులు మొదలయ్యాయి. హైదరాబాద్ ను తలదన్నేలా రాజధాని నిర్మాణం దిశగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు మొదలెట్టిన, పూర్తి చేసిన పనులే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలోనూ ఇప్పటికీ కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క ఇటుక పేర్చి.. రాజధానిలో అదనంగా చేపట్టిన పనులేమీ లేవు.
ప్రభుత్వం మారాక.. రాజధాని అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు తలపెట్టిన యజ్ఞాన్ని తాను పూర్తి చేసినా ఫలితం ఆయనకే వస్తుందనుకున్నారో.. ఏమో.. అమరావతిని జగన్ పట్టించుకోలేదు. పైగా.. వైసీపీ నేతలు రాజధానిపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అక్కడ ఎన్నికోట్లు ఖర్చుచేసినా వేస్ట్ అని.. మునిగిపోతుందని.. వృథా ఖర్చని పదేపదే ప్రచారం సాగించారు. అమరావతికి.., అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశారు. వందలకోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వ భవనాలను నిరూపయోగంగా మార్చారు. చంద్రబాబునాయుడి దిగేసరికి ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అవే అలాగే మొండిగోడలుగా.., పనికిరాని భవనాలుగా ఉండిపోయాయి. 80 నుంచి 90 శాతం పనులు పూర్తయిన నిర్మాణాలను సంపూర్ణం చేసి.. అందుబాటులోకి తేవాల్సిన వైసీపీ ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రాజధానిలో అభివృద్ధి ఆగిపోయింది. చుట్టుపక్కల భూముల విలువ తరిగిపోయింది. రైతులకు శోకం మిగిలింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల 11 నెలల కాలంలో రాజధానిలోని నిర్మాణాల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని, నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలమవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా రూ. 9వేల కోట్ల రూపాయలు అమరావతిలో వెచ్చించారు. రోడ్లు అర్థాంతరంగానే ఉన్నాయి. భవనాలు అరకొరగానే నిలిచిపోయాయి. చివరకు ఆయా నిర్మాణాల కోసం తరలించిన మెటీరియల్ సైతం కొందరు అపహరించుకుపోతున్నా అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొంత ఎక్కడి వేసిన మెటీరియల్ అక్కడే కనిపిస్తోంది.
అమరావతి రాజధాని కావడంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం అక్కడ ఏర్పాటు చేసుకుని.. భవనాలు పూర్తి చేసుకున్నా ప్రారంభం కాని దుస్థితి. ఈ నాలుగు సంవత్సరాల 11 నెలల కాలంలో వందలాది మందికి అంతర్జాతీయంగా పారిశ్రామిక, కమ్యూనికేషన్, టెక్స్టైల్ మరియు IT ఇంటిగ్రేటెడ్ డిజైన్ కోసం అత్యుత్తమ విద్యా బోధన అందించాల్సిన సంస్థలో కనీసం ఇప్పటివరకూ ఒక్క బ్యాచ్ కూడా మొదలుకాలేదు. కనీసం జగన్ చెప్పిన మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉందన్న విషయాన్నైనా గుర్తించి.. అభివృద్ధి చేపట్టలేదు. పోనీ.. విశాఖపట్టణంలో అయినా.., కర్పూలులో అయినా.. ఎన్ఐడీ లాంటి సంస్థలను జగన్ నెలకొల్పగలిగారా అంటే అదీ లేదు. కేవలం రాజకీయ వైషమ్యాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను జగన్మోహన్ రెడ్డి అంధకారం చేశారని రాజధాని ప్రాంత రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలే కాదు.. అది వాస్తవమేనని అమరావతిలో నిలిచినపోయిన నిర్మాణాలను, పెరిగిన పిచ్చి మొక్కలను, మట్టిరోడ్లను చూస్తే అర్థం అవుతుంది. వ్యాపార కార్యకలాపాలతో, ఆకాశ హర్మ్యాలతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భవనాలతో.. కళకళలాడాల్సిన ఏపీ రాజధాని అమరావతి.. నేడు ఇలా మిగిలిపోవడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైషమ్యాలే కారణమని, మరోసారి చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే.. అమరావతి పునరుజ్జీవన చెందుతుందని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రచారం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY