ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 16, గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో రుణాలు తీసుకున్న వారికి వన్ టైం సెటిల్మెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం. వన్ టైం సెటిల్మెంట్లో చెల్లింపులు చేసిన వారికీ పూర్తి హక్కులను అందజేసేలా నిర్ణయం. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రూ.10వేలు, మున్సిపాల్టీకి చెందిన వారు రూ.15వేలు, అర్బన్ ప్రాంతాలకు చెందిన వారు రూ.20వేలు చెల్లింపును వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- అలాగే హౌసింగ్ కార్పొరేషన్నుంచి రుణం తీసుకుని, ఒకవేళ ఆ ఇల్లు ఎవరికైనా అమ్మిన పక్షంలో ప్రస్తుతం ఆ ఇంటిని కొనుగోలుచేసిన, అర్హత ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలలో రూ. 20వేలు, మున్సిపాల్టీల్లో రూ.30వేలు, కార్పొరేషన్లలో రూ.40వేలు ఒన్ టైం సెటిల్ మెంట్ కింద కడితే సరిపోతుందని తెలిపారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 46 లక్షలమందికిపైగా లబ్ధి పొందనున్నారు.
- పేదలందరికీ ఇళ్లులో భాగంగా లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున రుణాలు.
- నవరత్నాల అమలులో భాగంగా రెండో విడత ఆసరాకు కేబినెట్ ఆమోదం.
- ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఏడాది కాలానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1.5 కోట్లు.
- రాయలసీమ కరవు నివారణ లో భాగంగా హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్–2లో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకూ రూ.1929 కోట్లతో విస్తరించనున్న పనులకు ఎఫ్ఆర్బిఎం నిబంధనలనుంచి మినహాయింపు.
- రాష్ట్రంలో ఆసుపత్రులు, స్కూళ్లలో చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం.
- డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ 1940 చట్టం సవరణకు, కల్తీలు, నకిలీలను అడ్డుకునేందుకు చట్ట సవరణ ఆమోదం. తప్పిదాలకు పాల్పడితే లైసెన్స్ల రద్దు, భారీ జరిమానాలు.
- ఏపీ ఫాస్టర్ కేర్ గైడ్లైన్స్ 2021కి కేబినెట్ ఆమోదం, జువనైల్ జస్టిస్ చట్టం 2015 కింద మార్గదర్శకాలు.
- నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మైక్రోసాఫ్ట్ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం. దాదాపు రూ.30.79 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్న మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ అమలుకు మానిటరింగ్, ఎవల్యూషన్ కమిటీ ఏర్పాటు.
- మైనార్టీ వర్గాలకూ సబ్ ప్లాన్ చారిత్రక నిర్ణయమని ప్రశంసించిన కేబినెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మైనార్టీలకు సబ్ప్లాన్ సూత్ర ప్రాయ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- సీఐడీ డిపార్ట్మెంట్లో అడిషనల్ హోంగార్డు పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం.
- శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ