ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ఎక్సైజ్ విధానంలో మార్పులు తీసుకొస్తుంది. గత సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుతో మద్యం పాలసీ పూర్తవుతుండడంతో 2020-21 సంవత్సరానికి గానూ నూతన మద్యం పాలసీని శుక్రవారం నాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం అక్టోబర్ 1, 2020 నుంచి సెప్టెంబర్ 20, 2021 వరకు అమల్లో ఉండనుంది. ఈ పాలసీలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 2934 మద్యం దుకాణాల లైసెన్సును ఏడాది పాటుగా రెన్యువల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక ఏపీలో కొత్తగా మద్యం మాల్స్ రానున్నాయి. వాక్ ఇన్ షాప్స్ గా వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశముంది. ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పోరేషన్స్ ఆధ్వర్యంలోనే ఇవి కూడా నడవనున్నాయి. అయితే రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,934 దాటకూడదని ఆదేశాలు ఇచ్చారు. దుకాణాల సంఖ్య పెరగకుండా, వాటి పరిధిలోనే వాక్ ఇన్ షాప్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారుల పక్కన మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు ప్రకటించిన నిబంధనలు కచ్చితంగా అమలుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి ప్రాంతం వరకు, ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి వరకు మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలలో అవకతవకలకు అవకాశం లేకుండా ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu