కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి వేడుకలలో భాగంగా బాణాసంచా కాల్చడంపై దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరాల్లో బాణాసంచా(టపాసులు) కాల్చడాన్ని కేవలం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పండుగ రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టపాసుల అమ్మకాలపై కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని నిబంధనలను జారీ చేసింది. దుకాణాల వద్ద కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మాలని ఆదేశాలు ఇచ్చారు. టపాసులు అమ్మే ప్రతి దుకాణం మధ్య 10 అడుగుల తప్పనిసరిగా దూరం పాటించాలని పేర్కొన్నారు. అమ్మకాల సమయంలో దుకాణాల వద్ద ఒక్కక్కరి మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. మరోవైపు టపాసులు అమ్మే దుకాణాల వద్ద వద్ద శానిటైజర్ వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉండడం, బాణాసంచా కాలుష్యం వల్ల కరోనా ప్రభావం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కర్నాటక సహా పలు రాష్ట్రాలు బాణాసంచా వాడకంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం కూడా బాణాసంచా కాల్చడంపై ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ