ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 20, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మీ-సేవ’ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవలను గ్రామ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంతో మీ-సేవ కేంద్రాలు నిర్వహించే వారి ఉపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని మీ-సేవ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేపడతామని రాష్ట్ర మీ-సేవ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు కె.యుగంధర్, ప్రధాన కార్యదర్శి ఎస్.భానుమూర్తి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలకు చెందిన 11 వేల మంది ఆపరేటర్లుతో పాటు 35వేలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని వారు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యల వలన సుమారు 40వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా విభాగంలో విప్లవాత్మక మార్పు దిశగా గ్రామసచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సచివాలయ వ్యవస్థ పరిధిలోనే మీ-సేవ తరహా డిజిటల్ సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలోనే మీ-సేవ ఆపరేటర్లు తమ భవిష్యత్ దృష్ట్యా ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
[subscribe]