దేశ, విదేశాల నుంచి తిరుమల ఆలయానికి వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన నేతృత్వంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించటం కోసం సర్వదర్శనం స్లాట్ విధానం త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభిస్తున్నామని, అలాగే నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కొండపై నివాసముంటున్న టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ లో 700 లకు పైగా గదులకు మరమ్మతులు నిర్వహిస్తామని ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.
ఇకపై వ్యర్థ పదార్థాలతో బయో గ్యాస్ని తయారు చేస్తామని, ఆ బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాదం, లడ్డు తయారీ చేస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. బాలాజీనగర్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ కోసం 2.86 ఎకరాలు ఆర్టీసీకి కేటాయించామని చెప్పారు. మే 5న సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీనివాస సేతు తొలి దశను ప్రారంభిస్తామని, దీనికోసం 100 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని ‘స్విమ్స్’ ఆస్పత్రిలో క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా 300 బెడ్లతో వార్డును ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టీటీడీ అస్థాన సిద్ధాంతిగా వెంకటకృష్ణ పూర్ణ సిద్ధాంతిని నియమించామని తెలిపారు. కాగా వస్తు రూపేణా స్వామి వారికి విరాళాలు ఇచ్చే దాతలకు దర్శనంలో ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ