తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీపీలు మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ అనిల్ కుమార్, ఐజీపీ ఇంటలిజెన్స్ రాజేష్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, రంగారెడ్డి కలెక్టర్ అమేయ్ కుమార్, సీడ్స్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య ఉన్నదని, తక్కువ ధరకు విత్తనాలు లభిస్తుండడం మూలంగానే రైతులు నకిలీ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రధానంగా సాగులో ఉండే కలుపు సమస్యను ఎదుర్కోవడానికి గడ్డి మందు కొట్టేందుకు అవకాశం ఉండడంతో కలుపు కూలీలు తగ్గుతున్నాయని రైతులు నకిలీ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారు. గడ్డి మందు గ్లైఫో సెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలి. లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మినా, కాలంతీరిన విత్తనాలను అమ్మినా కఠినచర్యలు తీసుకోవాలి, హెచ్ టీ కాటన్ విత్తనాలను అరికట్టాలని చెప్పారు. రైతులు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నకిలీ విత్తనాలను కొనవద్దని, ఈ ఏడాది పత్తి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. గత ఏడాది వర్షాలు వెనకాముందు కావడం, అధికవర్షాల మూలంగా పెద్దఎత్తున సాగు చేయలేకపోయారని చెప్పారు.
నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి:
“నకిలీ విత్తనాల తనిఖీలలో నిబంధనల మేరకే టాస్క్ ఫోర్స్ టీం వ్యవహరించాలి. తనిఖీలలో అత్యుత్సాహం ప్రదర్శించడం, తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. విత్తనాలు, పురుగుమందుల స్టాక్ వివరాలు దుకాణాల ముందు ఉంచాలి. స్టాక్ వివరాలు పెట్టలేదన్న కారణాలతో షాపులు సీజ్ చేయొద్దు, వారికి విషయం తెలిపి అవకాశం ఇవ్వాలి. లైసెన్స్ పరిమితి తీరిన తర్వాత దాని రెన్యువల్ కు కొంత సమయం ఉంటుంది. ఆ సమయం కూడా తీరి ఉంటేనే అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అని నిర్దారణ అయిన తర్వాతనే కేసులు నమోదు చేయాలి. విత్తనరంగంలో తెలంగాణకు ఉన్న ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నకిలీ విత్తనాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అవకాశాలను పరిశీలిస్తున్నాం. చట్టంలోని లొసుగులతో దోషులు తప్పించుకోకుండా వెంటనే శిక్షలు అమలయితే నకిలీ విత్తన తయారీదారులలో మార్పు వస్తుంది. దోషులు తప్పించుకోవద్దు, నిర్దోషులు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, రైతుల కష్టం వృధాకావద్దు” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ