కూటమిలో కొన్నిచోట్ల పొత్తుల లెక్కలు తప్పుతున్నాయి. కూటమి వల్ల తాము సీటు కోల్పోయామన్న కోపంతో ఆశావాహులు.. బాహాటంగానే విమర్శలకు, దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పుడు అధినేతలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురం, తిరుపతి సీట్లపై టీడీపీలో లొల్లి జరుగుతోంది.
తాజాగా విశాఖ సీటు కోసం బీజేపీ, టీడీపీ మధ్య కూడా ఈ లొల్లి తప్పేలా లేదు. ఈ సీటు ఏ పార్టీదో కూడా ఇంకా తేలనేలేదు. కూటమి నుంచి అభ్యర్థి ఎవరనే ప్రకటన కూడా రాలేదు. అయినా సరే బీజేపీ, టీడీపీ ఆశావాహులు ఎవరికి వారే తానే అభ్యర్థినంటూ ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. సీటు కోసం ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం.. రెండు పార్టీల అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది.
విశాఖ ఎంపీ సీటుపై భారీగా ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు.. జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే జోరుగా ప్రచారం చేసేసుకుంటున్నారు. మరోవైపు తానే తెలుగు దేశం పార్టీ అభ్యర్థి నంటూ ప్రచారం చేసుకుంటున్న మోతుకుమిల్లి శ్రీ భరత్తో టీడీపీ, బీజేపీ మధ్య ప్రచార యుద్ధం మొదలయినట్లయింది. ఫ్లెక్సీలతో జీవీఎల్, ప్రచార రథంతో భరత్ ఇద్దరూ కూడా సీటు తమదంటే తమదని విశాఖ కార్యకర్తల్లో గందరగోళం రేపుతున్నారు.
విశాఖ పార్లమెంటు స్థానం అభ్యర్థి గురించి కూటమి నుంచి ప్రకటన రాకపోయినా అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందంటూ శ్రీ భరత్ ఇప్పటికే ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇక జీవీఎల్ నరసింహ కూడా కూటమి నుంచి తనకే సీటు దక్కుతుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాన రోడ్లపై వెలసిన ఫ్లెక్సీలు కూడా వెలుస్తూ స్థానికులను అయోమయానికి పడేస్తున్నాయి. మరోవైపు తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బ్రాహ్మన సంఘం.. జీవీఎల్కే విశాఖ పార్లమెంట్ సీటును కేటాయించాలని డిమాండ్ చేశాయి.
విశాఖ పార్లమెంటు సీటు తెలుగు దేశం పార్టీకే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే విశాఖ ఉక్కు సమస్యతో పాుట, స్పెషల్ స్టేటస్, పోలవరం, విశాఖ రైల్వే జోన్ విషయంలో బీజేపీపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో బీజేపీ ఈ సీటును అడిగినా టీడీపీ మాత్రం నో చెప్పేసింది. మొదటగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ సీటును ఆశించారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా తాను అధిష్టానాన్ని సీటు అడిగానని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ అభ్యర్థి భరత్ కూడా అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది కాబట్టే ఈ ప్రచారం సాగిస్తున్నానంటూ చెబుతున్నారు.
తాజాగా విశాఖ సిటీలో ‘మీ వెంటే ఉంటా.. మీ బంగారు భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తా’ అంటూ కొన్నిచోట్ల జీవీఎల్ ఫ్లెక్సీలు కనిపించడంతో విశాఖవాసులు ఇంతకీ ఎవరు పోటీ చేస్తున్నారంటూ అయోమయానికి గురవుతున్నారు. వీలయినంత త్వరగా విశాఖ పార్లమెంటు స్థానానికి కూటమి తరఫున అభ్యర్థి ప్రకటిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE