తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత ఎట్టకేలకు తొలిగిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏడు నెలల అనంతరం గత అర్ధరాత్రి నుండి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ముందుగా సోమవారం నాడు తెలంగాణ, ఏపీ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై అవగాహనా ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో టిఎస్ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఒప్పందం ప్రకారం ఏపీలో 826 టిఎస్ఆర్టీసీ బస్సులు 1,61,258 కిలోమీటర్ల మేర తిరగనున్నాయి. అలాగే తెలంగాణలో 638 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 1,60,999 కిలోమీటర్ల పరిధిలో తిరగనున్నాయి. దసరా పండుగ సమయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఒప్పందం కుదరడంతో కరోనా నిబంధనలకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు కొనసాగనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ