ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని కోఠిలో ఉన్న సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు వాట్సప్ ద్వారా ఎంపీకి సమాచారం అందించింది. కాగా అంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆదివారం అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో సీబీఐ అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించింది.
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం భాస్కర్ రెడ్డిని సీబీఐ న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను నగరంలోని చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే భాస్కర్ రెడ్డికి బీపీ పెరిగినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో, కోర్టు ఆదేశాల మేరకు ఆయనను జైలు ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇతర ఖైదీలు ఆయనను కలవకుండా జైలు ఆస్పత్రి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇక ఇదే కేసులో ఇప్పటికే సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డిలు కూడా ఈ జైలులోనే ఉండటం గమనార్హం. అయితే వీరందరిని ఒకే చోట కాకుండా వేర్వేరు బ్యారక్లలో ఉంచారు. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా వైసీపీ శ్రేణులు పులివెందులలోని వైఎస్ విగ్రహం నుంచి పూల అంగళ్ల వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేశారు.
కాగా ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు సార్లు విచారించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు ఐదోసారి ఆయన నేడు సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఇక తండ్రి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఈరోజు అరెస్టు చేయొచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. పులివెందులలోని తన నివాసం నుంచి నేటి తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్కు బయలు దేరారు. 10 వాహనాల్లో అనుచరులతో కలసి హైదరాబాద్కు బయలు దేరారు. ఇక గతంలో మాదిరిగానే అవినాష్ విచారణ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ అధికారులు వీడియో, ఆడియో రికార్డ్ చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE