వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యతకై జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు మహాకూటమి ఏర్పాటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలలోని ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఆయన దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సీఎం నితీష్ కుమార్ భావిస్తున్నారు. కాగా నితీష్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో బుధవారం కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకేతించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం నితీష్ కుమార్ జేడీ(యూ) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘త్వరలో చాలా పార్టీలు ఏకతాటిపైకి వస్తాయి. కాంగ్రెస్తో సమగ్రంగా చర్చించా. ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా అంగీకరించారు. అందరి ఆమోదంతో మేమంతా బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే పనిలో ఉన్నాం. దీనిలో భాగంగా నిన్న సీపీఐతో కూడా మాట్లాడా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై నిర్ణయించుకునేందుకు విపక్షాలన్నీ ఒకచోట కూర్చుని చర్చించుకోవాలన్నది నా కోరిక’ అని వెల్లడించారు. అయితే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్కు సమ దూరాన్ని పాటిస్తున్న పార్టీలతో చర్చించాలని నితీశ్ ఆలోచనగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా నితీష్ కలిశారు. ఇక సీఎం కేసీఆర్ కూడా గతేడాది బీహార్ వెళ్లి నితీష్ కుమార్ను కలుసుకుని, ఉమ్మడిగా విలేఖరుల సమావేశం పెట్టి బీజేపీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE