తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. గత వారంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మరియు ఏపీ మంత్రుల మధ్య జరిగిన మాటల యుద్ధంపై స్పందించారు. తొలుత ఏపీలోని పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడం, దానికి వైసీపీ మంత్రులు బదులిస్తూ చేసిన విమర్శలు, ప్రతి విమర్శలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన జనసేనాని, వైసీపీ మంత్రులు హద్దులు దాటి పోయారని, వారు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు మిమ్మల్ని బాధపెడితే వ్యక్తిగతంగా మాట్లాడాలే కానీ, దానిని ఆ ప్రాంత ప్రజలందరికీ ఆపాదించి అవమానించడం తగదని హితవు చెప్పారు.
మంత్రి హరీశ్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, అయితే ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్ణకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైస్సార్సీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. గతంలో తెలంగాణ నాయకులు కొందరు ఇలాగే మాట్లాడిన ఘటనలను ప్రస్తావించిన జనసేనాని పాలకులు వేరు, ప్రజలు వేరు అని స్పష్టం చేశారు. పాలకులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, తెలంగాణ ప్రజలను అవమానించడం.. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం సరికాదని తెలిపారు. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, మొన్నటి వరకు మంత్రి బొత్స లాంటి వారు తెలంగాణలో కేబుల్ బిజినెస్లు చేశారని వెల్లడించారు. ఇక వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని, వారి వివాదాల్లోకి ప్రజలను లాగద్దని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు ప్రవర్తించడం బాధాకరమని, ఈ వ్యవహారంపై సీఎం జగన్ కూడా స్పందించాలని పవన్ కల్యాణ్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE