తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుధవారం ఆయన కుప్పంలో చేపట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబును పోలీసులు శాంతిపురం మండలం పెద్దూరు వద్ద అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి రోడ్ షోలు, ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. దీంతో టీడీపీ అధినేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటని కుప్పం పోలీసులను ప్రశ్నించిన ఆయన వారి తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోలీసులు వారించారు.
ఈ క్రమంలో తదుపరి కార్యాచరణ కోసం చంద్రబాబు నాయడు స్థానిక నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఆయన వెంట అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, శ్రీనివాసుల నాయుడు తదితర నేతలు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ప్రభుత్వం ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. ఈ విషయమై టీడీపీ కుప్పం కార్యాలయ ఇన్చార్జికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కుప్పం టీడీపీ కార్యాలయ ఇన్చార్జిని పిలిపించి జీఓ ప్రకారం నడుచుకుంటానని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కూడా పోలీసులు కోరారు. ఒకవేళ ఈ షరతులకు అంగీకరించని పక్షంలో ప్రచార రథాల వాహనాలను సీజ్ చేస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం చంద్రబాబు రాకకు ముందు పోలీసులు టీడీపీ ప్రచార రథాన్ని నిలిపివేశారు. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE